సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : సంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చి ప్రజలకు ఇబ్బందులు తొలగించడంతో పాటు విద్యుత్ భారాన్ని జీహెచ్ఎంసీ తగ్గించుకున్నది. ఎల్ఈడీ వీధి దీపాల ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ.490కోట్లను ఆదా చేసుకుంది. గతంలో వీధి దీపాల నిర్వహణ జీహెచ్ఎంసీకి సమస్యగా ఉండేది. నిర్వహణకు పెద్ద ఎత్తున విద్యుత్ ఖర్చయ్యేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో 4.93 లక్షల వీధి దీపాల ( 101.32 మెగా వాట్ల సామర్థ్యం)కు ఎల్ఈడీ లైట్లను అమర్చారు. తద్వారా రూ.490 కోట్లు ఆదా అయినట్లు అధికారులు పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీలో 2017 -18 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు రూ. 490 కోట్ల రూపాయల మేర ఆదా అయ్యింది. 2017-18 సంవత్సరంలో రూ. 42.42 కోట్లు, 2018-19లో రూ. 85.23 కోట్లు, 2019-20లో రూ. 84.48 కోట్లు, 2020-21లో రూ. 86.72కోట్లు, అక్టోబర్ 2021 వరకు రూ. 49.93 కోట్లు , ప్రస్తుత డిసెంబర్ 2022 రూ.80కోట్ల మేర ఆదా అయినట్లు అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, పబ్లిక్ రంగ సంస్థ (ఎన్టీపీసీ)జాయింట్ వెంచర్తో పని చేస్తుందని తెలిపారు. వీధి దీపాల నిర్వహణ సమర్థవంతంగా కొనసాగుతున్నదని అధికారులు చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆయా కార్యాలయాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపు భారం కాకుండా పలు కార్యాలయ భవనాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి జీరో కరెంట్ బిల్లుకు శ్రీకారం చుట్టారు. సంస్థ పరిధిలోని జోనల్, సర్కిల్ కార్యాలయ భవనాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు 941 కెడబ్ల్యూపి సోలార్ పి.వి గ్రిడ్ రూఫ్ టాప్ సిస్టమ్ నెట్ మీటరింగ్ పద్ధతిలో సైప్లె చేసేందుకు రాష్ట్ర పునరుద్ధరణ ఇంథన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (టీఎస్ రెడ్కో)కు రూ.3.50 కోట్లతో కాంట్రాక్టు ఒప్పందం జరిగింది. సోలార్ సిస్టం ఏర్పాటుకు డిజైన్, సైప్లె, బిగింపుతో పాటు ఐదేండ్ల వరకు పూర్తి నిర్వహణ బాధ్యత ఉంటుంది.
ప్రతి సంవత్సరం 1500 కిలోవాట్స్ కనీసం ఉత్పత్తి చేయాలి. అంటే 14,11,500 యూనిట్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఎకువగా ఎండ ఉన్నప్పుడు నిర్దేశించిన లక్ష్యం కంటే ఎకువ మొత్తంలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎకువ ఉత్పత్తి అయిన దానిని ఆదా చేస్తే జీహెచ్ఎంసీకి కనీసం రెండున్నర ఏళ్లలోపు గాని అంతకంటే ముందు గాని రూ.1.27 కోట్ల చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటి వరకు 34 కార్యాలయ భవనాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి గడిచిన రెండున్నర ఏళ్లలో సుమారు 30 లక్షల యూనిట్స్ ఉత్పత్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. సౌర వెలుగులతో జీరో విద్యుత్ బిల్లులతో పాటు సంస్థకు ఖర్చు తగ్గుతుందని తెలిపారు.