కరోనా మృతుల అంత్యక్రియల్లో చేయూత
మానవత్వాన్ని చాటుతున్న యూత్ వెల్ఫేర్ తెలంగాణ, ఫీడ్ ది నీడీ సభ్యులు
73969 69475, 79954 04040 నంబర్లకు ఫోన్ చేస్తే సాయమందిస్తున్న సేవకులు
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): కరోనా సోకిన వారు బతికితే ఏ బాధా లేదు.. మరణిస్తే మాత్రం అనాథ శవమే. కరోనా మృతుల విషయంలో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. సొంత మనుషులే పరాయివారిలా ప్రవర్తిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ప్రేమాప్యాయతలు పంచిన వారిని కనీసం తాకడానికి కూడా కొందరు సాహసించడం లేదు. దూరం నుంచే ఫొటోలు, వీడియోలు తీస్తూ అంత్యక్రియల నిర్వహణ తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. నిన్నటిదాకా బంధువులు, స్నేహితులమని చెప్పుకున్న వారు కడసారి చూపునకు కూడా రావడం లేదు. కొవిడ్ మృతుల దరిదాపులకు వచ్చినా వైరస్ తమను ఆవహిస్తుందన్న అపోహతోనే చాలామంది వింతగా ప్రవర్తిస్తున్నారు. నలుగురు చెయ్యేస్తేనే పాడె లేవాలి. కానీ ఇప్పుడు ఆ నలుగురే కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో మేమున్నామంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. యూత్ వెల్ఫేర్ తెలంగాణ, ఫీడ్ ది నీడీ స్వచ్ఛంద సంస్థలు కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి. సాయం కావాలని ఒక్క ఫోన్ చేస్తే చాలు అంతిమ సంస్కారాలను పూర్తి చేస్తున్నాయి.
స్నేహితుడొకరు కరోనాతో మృతిచెందగా అంత్యక్రియలు నిర్వహించేందుకు తాము పడ్డ ఇబ్బందులు మరెవరూ పడొద్దన్న ఉద్దేశంతో ముందుకొచ్చింది ఫీడ్ ది నీడీ సంస్థ. ఐటీ ఉద్యోగులైన అంకిత్రాజ్, అనుముడ్ థామస్, ప్రదీప్, ప్రశాంత్, రమన్జిత్సింగ్, సాయితేజ, సురేంద్ర, విద్యాసాగర్, వినయ్, శ్రీనివాస్ బెల్లం ఈ సంస్థను నడుపుతున్నారు. లాక్డౌన్ సమయంలో ఆహారం, నిత్యావసరాలు పంపిణీచేశారు. ఆ తరువాత కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించేందుకు ముందుకొచ్చారు. ఒక స్నేహితుడు కరోనాతో మృతి చెందగా, అతని కుటుంబసభ్యులు క్వారంటైన్లో ఉండటంతో అతని అంత్యక్రియలు నిర్వహించటం ఎంతో ఇబ్బందిగా మారిందని వారు తెలిపారు. అంబులెన్స్, అంత్యక్రియలకు రూ.60 వేలు డిమాండ్ చేశారని చెప్పారు. దీంతో తాము తీవ్రంగా ఇబ్బంది పడ్డామని శ్రీనివాస్ బెల్లం అన్నారు. ఇలాంటి కష్టం మరొకరికి రావొద్దని అంబులెన్స్ను సమకూర్చుకుని, డ్రైవర్, హెల్పర్లను నియమించి తామే అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు ఎన్ని కాల్స్ వచ్చినా స్వీకరిస్తున్నామని.. పేదలైతే అంత్యక్రియలు ఉచితంగానే చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో తమ సేవల కోసం 7995404040 నంబర్లో సంప్రదించాలని కోరారు.