దశాబ్దాల తరబడి హైదరాబాద్ నగరాన్ని వేధిస్తున్న అస్తవ్యస్తమైన వరద కాల్వల వ్యవస్థను గాడిన పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎస్ఎన్డీపీ)లో విడతల వారీగా ఫలాలు అందుబాటులోకి వస్తున్నాయి. 985 కోట్ల రూపాయలతో నగర వ్యాప్తంగా 60 చోట్ల చేపట్టిన ఈ పనులు వడివడిగా సాగుతున్నాయి.బేగంపేట ప్రధాన రహదారిపై పికెట్ నాలాపై నిర్మించిన వంతెన అక్టోబర్ మాసంలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఎల్బీనగర్ నియోజకవర్గంలో 7.26 కోట్లతో బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు నిర్మించిన బాక్స్ డ్రైన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. దీంతో అక్కడ అనేక కాలనీలకు వరద ముంపు సమస్య తీరనున్నది. వచ్చే వర్షాకాలం నాటికి నగరానికి ముంపు ఇక్కట్లను శాశ్వతంగా దూరం చేసే విధంగా ఎస్ఎన్డీపీ పనులు సాగుతున్నాయి.
సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)లో భాగంగా చేపట్టిన అభివృద్ధి ఫలాలు విడతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్లో పికెట్ నాలాపై బ్రిడ్జి పనులు, ఎల్బీనగర్ జోన్లో రూ. 7 కోట్ల 26 లక్షల వ్యయంతో బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు బాక్స్ డ్రైన్ పనులు పూర్తి అయ్యాయి. ఈ రెండు చోట్ల ప్రాజెక్టు పనులను త్వరలో ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నది. ఎస్ఎన్డీపీ ద్వారా రూ. 985 కోట్ల వ్యయంతో 60 పనులు ప్రతిపాదించగా అందులో 37 పనులు జీహెచ్ఎంసీ పరిధిలో కాగా మిగతా 23 పనులు జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలో ముందుగా పనులను ప్రతిపాదించారు. అందులో జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 737.45 కోట్ల విలువగల 35 పనులు చేపట్టారు. అంతేకాకుండా ఇతర మున్సిపాలిటీలలో రూ.248 కోట్ల విలువ గల పనులు చేపట్టారు.
వచ్చే మార్చి నాటికల్లా మొదటి విడత పూర్తి..
బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు చేపట్టే పనులతో అనేక కాలనీలకు వరద ముంపు సమస్య తీరనున్నది. జీహెచ్ఎంసీ ప్రజల అవసరాలను గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన 35 పనులలో ఇప్పటి వరకు రెండు పనులు పూర్తి కాగా డిసెంబర్ చివరి వరకు సుమారు 32 పనులు పూర్తి చేసి మిగిలిన పనులన్నింటినీ మార్చి చివరి వరకు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 248 కోట్ల వ్యయంతో చేపట్టిన 21 పనులలో ఒక పని పూర్తయింది. మరో 16 పనులు డిసెంబర్ వరకు, మరో 4 పనులు వచ్చే సంవత్సరం మార్చి వరకు పూర్తి చేయనున్నామని అధికారులు పేర్కొన్నారు.నగర ప్రజలకు వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపేలా జీహెచ్ఎంసీ చర్యలు వేగిరం చేసింది.
ఈ నెలాఖరులో అందుబాటులోకి వచ్చే పనులు..
ఈ నెలాఖరులోగా గుర్రం చెరువు వద్ద కల్వర్టు, అలుగు నిర్మాణం, పల్లె చెరువు తూము, అలుగు నిర్మాణం పనులు పూర్తి చేసుకోనున్నాయి. అప్పా చెరువు వద్ద 550 మీటర్ల పొడవున బాక్స్ డ్రైన్, ప్రహరీ నిర్మాణం, అలుగు పునరుద్ధరణ, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన పనులు తుది దశకు చేరుకున్నాయి. మన్మానికుంట ఫంక్షన్హాల్ వరకు 540 మీటర్ల నాలా నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. రాజేంద్రనగర్ ఫిల్లర్ నం 191దగ్గర పోర్ట్ కాలనీలో చేపట్టిన 860 మీటర్ల నాలా నిర్మాణ పనులు, బాతుల చెరువు, శివం రోడ్డు, వీఎస్టీ కూడలి సమీపంలోని నల్లపోచమ్మ దేవాలయం వద్ద చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ నెలాఖరులోగా ఇవి అందుబాటులోకి రానున్నాయి.