సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్లో పాదచారుల భద్రతకు శాశ్వత భరోసా కల్పిస్తూ హెచ్ఎండీఏ అంతర్జాతీయ హంగులతో అకాశమార్గాన్ని (స్కైవాక్) నిర్మిస్తున్నది. రూ.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ స్కై వాక్ పనులు తుది దశకు చేరుకున్నాయి. డిసెంబర్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులను వేగవంతం చేసినట్లు అధికారులు గురువారం వెల్లడించారు.
మెట్రో తరహాలో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్కైవాక్ను నిర్మిస్తున్నది. రామంతాపూర్-బోడుప్పల్ రోడ్కు, హబ్సిగూడ-ఎల్బీనగర్ వైపు మార్గాలను అనుసంధానం చేస్తూ పాదచారులు అన్ని వైపులా వెళ్లేందుకు వీలుగా ఈ జంక్షన్ చుట్టూ సర్కిల్ ఆకారంలో స్కై వాక్ రానున్నది. ఎలివేటెడ్ కారిడార్తో పాటు సూర్యకాంతి, వర్షం బారిన పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఉప్పల్ మెట్రోస్టేషన్కు కనెక్టివిటి ఇవ్వనున్నారు. అత్యాధునిక లైంటింగ్, వీధి దీపాలు తదితర అలంకరణల నడుమ ఈ అకాశమార్గం అందుబాటులోకి రానున్నది.