సుల్తాన్బజార్, సెప్టెంబర్ 15: నిలోఫర్ దవాఖానలో ఆరు నెలల బాలుడు అపహరణకు గురయ్యాడు. శుక్రవారం నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ తెలిపిన కథనం ప్రకారం.. గండిపేట చౌరస్తాలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో సెక్యూరిటీ గార్డులుగా జీవనం సాగిస్తున్న ఫరీదాబేగం, సల్మాన్ఖాన్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి జ్వరం రావడంతో చికిత్స కోసం నిలోఫర్ దవాఖానకు తీసుకొచ్చారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అడ్మిట్ చేసుకొని వైద్యం అందిస్తున్నారు. వీరి వెంట ఆరు నెలల వయసున్న చిన్నకుమారుడు ఫైసల్ఖాన్ కూడా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం గుర్తు తెలియని ఓ మహిళ వీరి వద్దకు వచ్చింది. నా రెండు నెలల బాబు కంటి సమస్యతో బాధపడుతున్నాడు.. దవాఖానలో అడ్మిట్ చేశానంటూ వచ్చీరాని హిందీలో మాట్లాడి.. ఫైసల్ఖాన్ తల్లి ఫరీదాబేగంతో చెబుతూ.. మాటలు కలిపింది. మీ బాబు వద్ద ఉండక.. ఇక్కడ ఏం పని ఉంది.. అని ఫరీదాబేగం అడగగా.. మా బాబు వద్ద అతడి తండ్రి ఉన్నాడని చెప్పి.. అక్కడే నిలబడింది. కాగా, భోజనం సమయం అయ్యింది.. బయటకు వెళ్లి తీసుకొస్తానంటూ.. బాలుడిని మంచం కింద పడుకోపెట్టిన ఫరీదాబేగం బయటకు వెళ్లింది. తిరిగి 15 నిమిషాల తర్వాత వచ్చిచూడగా.. మంచం వద్ద ఆరు నెలల బాలుడు ఫైసల్ఖాన్ కనిపించలేదు. గుర్తు తెలియని మహిళ కూడా కనిపించలేదు. వార్డులో ఉన్న రోగి సహాయకులను ఫరీదాబేగం అడుగగా.. ఓ మహిళ స్మార్ట్ఫోన్లో బాలుడికి కార్టూన్లు చూపిస్తూ తీసుకువెళ్లినట్టు చెప్పారు. వెంటనే నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. టాస్క్ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. బాలుడిని తీసుకెళ్లిన మహిళ వయస్సు దాదాపు 35 ఏళ్లు ఉంటాయని, ఫేర్గా ఉంటుందని, చాక్లెట్ కలర్ నైటీ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా ఎల్లో కలర్ స్కార్ఫ్ను ముఖం నిండా కప్పుకొని ఉందన్నారు. వివరాలు తెలిస్తే చెప్పాలని ఇన్స్పెక్టర్ కోరారు.