కీసర, మే 15 : పాత కక్షలతోనే అశోక్కుమార్పై ఆరుగురు నిందితులు కలిసి వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారని రాచకొండ డీసీపీ జానకీ ధరావత్ తెలిపారు. సోమవారం కీసర పోలీస్స్టేషన్లో రాచకొండ డీసీపీ జానకీ ధరావత్ విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట్ మండలం, అభంగాపూర్ గ్రామానికి చెందిన బూర్జుకాడి బి.విజయ్కుమార్ (38), ఆంజనేయులు (35), లింగప్ప (35), కిచ్చి నాగేశ్(25), కిచ్చి వెంకటేశ్ (27), గంజి శరత్కుమార్ (28) ఈ నెల 11న రాత్రి 7.40గంటలకు కీసర మండలం రాంపల్లిలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న అశోక్కుమార్పై వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. 25 సంవత్సరాలుగా మృతుల కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.
1999లో మృతుడు అశోక్కుమార్ ఇంటి మీద బాంబులు విసరడంతో అప్పట్లో అశోక్కుమార్ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయన్నారు. 2001 నుంచి 2004వరకు అశోక్కుమార్ మీద విజయకుమార్ అనుచరులు చేసిన దాడులుపై మారికల్ పోలీసుస్టేషన్లో కేసు కూడా నమోదు అయిందన్నారు. ఈ నెల 11న అశోక్కుమార్ను హత్య చేసిన తరువాత నిందితులు హయత్నగర్ మండలం తట్టి అన్నారంలో రక్తపు మరకల దుస్తులను కాల్చివేసి, వేటకొడవళ్లను సమీప పొదల్లో దాచిపెట్టినట్లు చెప్పారు. రాచకొండ పోలీసు అధికారుల ఆదేశానుసారం కీసర పోలీసు ఇన్స్పెక్టర్ రఘువీర్రెడ్డి, పోలీసు బృందాలతో నిందితులపై నిఘా పెట్టారు. వికారాబాద్ పోలీస్స్టేషన్లో లొంగిపోవడానికి సిద్ధమైన నిందితులను అరెస్టు చేసి కీసర పోలీస్స్టేషన్కు తరలించారు. వారి నుంచి కారును, 4 వేట కొడవళ్లు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకట్రెడ్డి, ఎస్వోటీ రాములు, కీసర సీఐ రఘువీర్రెడ్డి, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.