జియాగూడ, ఏప్రిల్ 28 : జియాగూడలో గత నాలుగు రోజుల కిందట జరిగిన హత్య కేసులో కుల్సుంపురా పోలీసులు ఆరుగురు నిందితులను ఆరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం కుల్సుంపురా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే వివరాలు వెల్లడించారు. జియాగూడ దుర్గానగర్కు చెందిన వరుణ్ వద్ద సంజయ్నగర్కు చెందిన యోగేశ్ రూ.20 వేలకు ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఐదు వేలు ఇచ్చి మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పి ద్విచక్రవాహనం నడుపుకుంటున్నాడు. ఎన్నిమార్లు డబ్బులు ఇవ్వాలని కోరినా ఇవ్వకపోవడంతో వరుణ్ తిరిగి ద్విచక్రవాహనం తెచ్చుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్యన వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఈ నెల 23న యోగేశ్ తన స్నేహితులు శంకర్, మహేశ్, మరికొంత మందితో కలిసి జియాగూడ వందఫీట్ల బైపాస్ రోడ్డులోని పెట్రోల్ పంప్ వద్ద సోహెల్(21), ఫైజాన్, వరుణ్, దీపక్కుమార్లను అడ్డగించి జియాగూడ డబుల్ బెడ్రూమ్ కాలనీలోని జె- బ్లాక్ భవనం టెర్రస్ పైకి తీసుకెళ్లారు.
వాహనం తీసుకువెళ్లడంతో వీరి పాత్ర ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం సేవిస్తూ.. కర్రలతో కొట్టారు. యోగేశ్ స్నేహితుడు శంకర్ బీరు సీసాతో సోహెల్ తలపై కొట్టడంతో తీవ్ర గాయాలపాలై అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. దీంతో నిందితులు అక్కడినుంచి పారిపోయారు. 24న ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన సోహెల్, దీపక్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సోహెల్ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు యోగేశ్, శంకర్, శరత్కుమార్, వరుణ్రావు, మహేశ్, రాజస్వామిలను ఆరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు ఆకాశ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సతీశ్ కుమార్, కుల్సుంపురా సీఐ అశోక్కుమార్, డీఐ సైదేశ్వర్, ఎస్సై శేఖర్, క్రైం సిబ్బంది పాల్గొన్నారు.