ఖైరతాబాద్, మే 6 : మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో సింగర్ మంగ్లీకి ప్రత్యేక్ష, పరోక్ష సంబంధాలున్నాయని న్యాయవాధి సుబ్బారావు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ, ఆమె సోదరుడు మీడియా ముందు అసత్యాలు ప్రచారం చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కేసుకు కులం, మతం, ప్రాంతం అంటూ తప్పుదోవపట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, త్వరలో వాటిని ప్రజల ముందుకు తీసుకొస్తానన్నారు. మంగ్లీకి ఈ స్కామ్తో సంబంధం లేకుంటే ఇతరులపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.
నిందితులపై ఇప్పటికే గద్వాల్, గచ్చిబౌలి, నల్గొండ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. రమావత్ మధు తనకు తెలియదని మంగ్లీ అంటున్నారని, నోట్ల కట్టలు లెక్కపెడుతన్న వీడియోలు, మిర్చి తోటలో నిందితులతో ఫొటోలు, వీడియోలపై ఆమె వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంతో వచ్చిన డబ్బులతో మంగ్లీ, ఆమె సోదరుడు బినామీల పేరుతో భారీ ఆస్తులు కొనుగోలు చేశారని, ఇందులో ఆమె మేనేజర్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. బాధితులకు అండగా ఉంటానని చెప్పిన మంగ్లీ ఇప్పటి వరకు మీడియా ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆమె తప్పు చేయనప్పుడు మేనేజర్తో ప్రత్యేకంగా ప్రెస్మీట్ ఎందుకు పెట్టించారని ప్రశ్నించారు.
ప్రెస్మీట్లకు సైతం రౌడీలను తీసుకొని వస్తున్నారని ఆరోపించారు. మంగ్లీ కేసు విషయంలో రాష్ట్ర కొత్త డీజీపీ సీవీ ఆనంద్ను కలిస్తే సానుకూలంగా స్పందించలేదన్నారు. ఈ కేసులో తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరితే అందరికీ భద్రత కల్పించడం తమ పని కాదంటూ బాధ్యతారాహిత్యమైన సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకేమైనా జరిగితే దానికి మంగ్లీ, డీజీపీలే కారణమన్నారు. వందల కోట్ల కుంభకోణం జరిగినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. మంగ్లీతో ఇప్పటికైనా చర్చకు సిద్ధమని, బాధితులకు డబ్బులు తిరిగి ఇస్తే తాను కేసు వాపసు తీసుకుంటానని స్పష్టం చేశారు. వచ్చే సోమవారం సీఎంను కలిసి వివరాలు అందిస్తానని తెలిపారు.