తెలుగు యూనివర్సిటీ, అక్టోబర్ 11: సింగరేణి మేడిపల్లి ఓపెన్కాస్ట్ గని తవ్వకాల్లో లభ్యమైన 110లక్షల సంవత్సరాలనాటి స్టెగోడాన్ జాతి ఏనుగు దంత అవశేషాలు, డైనోసార్ కాలానికి చెందిన శిలాజ కలపను పొందుపరుస్తూ ఏర్పాటు చేసిన పత్యేక పెవిలియన్ను ఆదర్శనగర్లో గల బిర్లా సైన్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, జీపీ బిర్లా పురావస్తు, ఖగోళ, వైజ్ఞానిక సంస్థ చైర్పర్సన్ నిర్మల బిర్లా పాల్గొని సింగరేణి పెవిలియన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ బలరామ్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం రామగుండం-1 ఏరియాలో మేడిపల్లి ఓపెన్కాస్ట్ గనిలో మైనింగ్ కార్యకలాపాలు జరుపుతున్న సందర్భంగా రెండు భారీ ఏనుగు దంతాలు, దవడ ఎముకలు శిలాజ రూపంలో లభ్యమయ్యాయని తెలిపారు.
గోదావరి పరివాహక ప్రాంతంలో 110లక్షల ఏళ్ల క్రితం సంచరించిన అనంతరం అంతరించిపోయిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగు అవశేషాలుగా శాస్త్రజ్ఞులు గుర్తించారని తెలిపారు. చరిత్ర పూర్వ యుగానికి చెందిన ఈ అవశేషాలను ప్రజలు, విద్యార్థులు వీక్షించడానికి అనువుగా ప్రతిష్టాత్మకమైన బిర్లా సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. బీఎం బిర్లా ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ కె.మృత్యుంజయరెడ్డి మాట్లాడుతూ.. ప్రాచీన కాలంనాటి ఒక గొప్ప చారిత్రక ఆనవాళ్లను సింగరేణి సంస్థ భద్రపరిచి బిర్లా సెన్స్ సెంటర్కు అందించడం హర్షించదగిన విషయమన్నారు.