సిటీబ్యూరో, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): సింగపూర్లో 2024 జూన్ 2 నుంచి 4 వరకు జరగనున్న 9వ ప్రపంచ నగరాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాల్సిందిగా సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ హైదరాబాద్ నగర గద్వాల్ విజయలక్ష్మిని కలిసి ఆహ్వానించారు. నివాసయోగ్యమైన, స్థిరమైన నగర సవాళ్లను పరిష్కరించడానికి, ఇంటిగ్రేటెడ్ అర్బన్ సొల్యూషన్స్ పంచుకోవడానికి, కొత్త భాగస్వామ్యాలను రూపొందించడానికి మేయర్లు, వ్యాపారవేత్తలు, పట్టణ నిపుణులతో ఈ ప్రపంచ నగరాల సదస్సు ఒక వేదికగా ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ వేదికలో వివిధ అంశాలపై మేయర్లు, బిజినెస్ లీడర్లు, పట్టణ నిపుణులతో స్మార్ట్, పునరుత్పత్తి నగరాలను సాధించడానికి గల అవకాశాలు, స్మార్ట్ సిటీల లక్ష్య సాధనకు పొల్యూషన్, ప్రస్తుతం భవిష్యత్లో అందరికీ మంచి నగర జీవితాన్ని అందించడంపై చర్చించనున్నట్లు చెప్పారు. తమ ఆహ్వానాన్ని స్వీకరించి, సింగపూర్ డబ్ల్యూఎస్కు వచ్చి నగరాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది, సుస్థిరంగా ఎలా మార్చవచ్చన్న అంశంపై అమూల్యమైన సందేశాన్ని, సలహాలు, సూచనలు ఇవ్వాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కోరారు. హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వారికి వివరించారు. నగరాన్ని అత్యున్నత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, సిగ్నల్ ఫ్రీ నగరంగా అభివృద్ధి చేసినట్లు మేయర్ చెప్పారు. కార్యక్రమంలో వైస్ కౌన్సిల్ మిస్ నికొల్ చెన్ తదితరులు పాల్గొన్నారు.