బొల్లారం,ఆగస్టు 4 : సిక్కం చెరువుకు మోక్షం ఎప్పుడు.ఏండ్లకు ఏండ్లు గడుస్తున్నా..పనులు చేప్టటడం లేదు. నిధులున్నా..చెరువు ప్రక్షాళనకు నోచుకోవట్లేదు. కంటోన్మెంట్ బోర్డు ఏడో వార్డు పరిధిలోని మలనీ ఎన్క్లేవ్ కాలనీలో ఉన్న సిక్కం చెరువుకు ప్రక్షాళన ఇప్పుడు.. అప్పుడు అని హడావుడి చేస్తున్నారు తప్ప ప్రక్షాళన దిశగా బోర్డు యంత్రాంగం అడుగులు వేయడం లేదు. బోర్డు సమావేశంలో చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని పాలక మండలి అప్పట్లో రూ.2కోట్ల 90 లక్షలు నిధులు కేటాయించి ప్రక్షాళన చేపడతామని సుదీర్ఘంగా చర్చించినా ఫలితం లేదు. కొనేండ్లుగా వర్షాలు కురిసినప్పుడల్లా చెరువులోని నీరు కాలనీలకు చేరి కాలనీలు,సమీప బస్తీలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో కాలనీవాసులు నరకం అనుభవిస్తున్నారు. బోర్డు అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే..!
పలుమార్లు నోటీసులు ఇచ్చినా..
ఈ ప్రాంతంలో చెరువు చుట్టు పక్కల బస్తీలు,కాలనీలకు తగిన నాలా సౌకర్యం లేదు. దీంతో ఆర్మీ పరిసర ప్రాంతం మురుగునీరంతా చెరువులోకి రావడంతో కలుషితంగా మారుతుంది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు బోర్డు అధికారులకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేదు.
ఓపెన్ నాలాలు ఏర్పాటు చేయాలి
చెరువు చుట్టూ పక్కల ఓపెన్ నాలాలు నిర్మించాలి. దీంతో మురుగు నీరు వేసినవాళ్లు అవుతారు. అదేవిధంగా ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బోర్డు అధికారులు తమకేమి పట్టనట్లుగా ఇండియన్ ఏయిర్లైన్స్ కాలనీ, డ్రైనేజీ లైన్ పగిలిన కారణంగా మురుగు నీరంతా చెరువులో కలిసిపోవడంతో నీరంతా కలుషితంగా తయారవుతుంది. దీంతో తరుచూ చుట్టు పక్కల బస్తీ ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చెరువుకు మరమ్మతులు చేపట్టాలి.
–సత్యనారాయణ గౌడ్, కాలనీ వాసి
బోర్డు అధికారులు దృష్టి సారించాలి
తిరుమలగిరి చెరువు ప్రక్షాళనకు త్వరలోనే తగిన చర్యలు తీసుకోవాలి.గతంలో కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించినం. అయినా ఇప్పటి వరకు బోర్డు అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. వర్షం వచ్చిన ప్రతిసారి సిక్కం చెరువు చుట్టూ పక్కల కాలనీలు బస్తీలన్నీ జలమయమవుతున్నాయి. కాలనీ వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బోర్డు యంత్రాంగం సమస్యను పరిష్కరించాలి. – భాగ్యశ్రీ,మాజీ బోర్డు సభ్యురాలు