T-NAB | రాష్ట్రంలో డ్రగ్స్ అణిచివేతకు ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీన్యాబ్) నిఘాను పటిష్టం చేస్తూ డ్రగ్ విక్రేతల జాడను గుర్తిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి డ్రగ్స్ రాకుండా కట్టడి చేయడంతో పాటు స్థానికంగా డ్రగ్స్ విక్రయాలు చేసే వారిపై, వినియోగించే వారిపై కూడా ఫోకస్ పెట్టారు. తాజాగా.. సైబరాబాద్ సైబర్క్రైమ్ ఠాణాలో పనిచేస్తున్న ఎస్సై రాజేంద్ర వద్ద డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన టీన్యాబ్.. అరెస్టు చేసింది. ఆరు నెలల కిందట సైబర్క్రైమ్ కేసులో ముంబైకి వెళ్లి నైజీరియన్లను అరెస్ట్ చేసిన సమయంలో ఎవరికీ తెలియకుండా 1750 ఎండీఎంఏ డ్రగ్ను ఎస్ఐ దాచిపెట్టిన ఇంటికి తెచ్చాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇటీవల తన వద్ద ఉన్న డ్రగ్స్ను విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన వద్ద డ్రగ్స్ ఉన్నదని.. కొనుగోలు చేసే వారుంటే చెప్పాలంటూ పలువురికి చెప్పాడు. ఇటీవల టీన్యాబ్ టీమ్లు డ్రగ్ విక్రయాలపై కూడా నిఘాను పెంచడంతో ఈ విషయం వారి దృష్టికి వచ్చింది. దీంతో టీన్యాబ్ తన నెట్వర్క్ను ఉపయోగించి ఫలానా చోట డ్రగ్ ఉన్నట్లు గుర్తించి, ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే అది ఎస్సై ఇల్లు అని తెలిసింది.
ఎక్కడున్నా గుర్తిస్తారు..!
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం టీన్యాబ్ను ఏర్పాటు చేసింది. రెండేండ్లుగా హైదరాబాద్ పోలీసులు హెచ్న్యూతో డ్రగ్స్ నెట్వర్క్ను ధ్వంసం చేశారు. టీన్యాబ్ ఏర్పాటైన తరువాత కూడా అదే దూకుడు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే గోవా, ముంబై, బెంగళూర్ నుంచి హైదరాబాద్కు డ్రగ్ సరఫరాను కట్టడి చేస్తూ స్మగ్లింగ్ ముఠాలను పట్టుకుంటున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్ వస్తుంది.. ఎక్కడికి వెళ్తుంది.. డిమాండ్, సైప్లె నెట్వర్క్ను గుర్తిస్తున్నారు. అమ్మకం దారులతో పాటు వినియోగదారులను సైతం అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్ పెడ్లర్స్ తెలంగాణ వైపు చూడాలంటే భయపడుతున్నారు. ఒకపక్క ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే డ్రగ్ను అరికట్టేందుకు ప్రయత్నిస్తూ, మరో పక్క స్థానికంగా డ్రగ్ వాడే వారిని గుర్తిస్తూ మాదక ద్రవ్యాల నెట్వర్క్పై ఉక్కుపాదం మోపుతున్నారు.