సుల్తాన్బజార్, ఫిబ్రవరి 23 : మలివిడత కంటి వెలుగులో భాగంగా 25 పని దినాలలో 50 లక్షల కంటి పరీక్షలను పూర్తి చేయడం అభినందనీయమని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి అన్నారు. గురువారం నాంపల్లి క్లస్టర్ పరిధిలోని ఆగాపురా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హిందీనగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 50 లక్షల కంటి పరీక్షలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి, కంటి వెలుగు కార్యక్రమ ప్రత్యేక అధికారిణి స్వరాజ్యలక్ష్మి, నాంపల్లి క్లస్టర్ ఎస్పీహెచ్వో నాగేంద్రబాబుతో కలిసి కేక్ కట్ చేశారు.
అనంతరం పలువురికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1500 టీమ్లతో కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. శిబిరాల్లో రీడింగ్ అద్దాలను ఉచితంగా అందజేస్తూనే, అవసరమైన వారికి ప్రిస్కిప్షన్ అద్దాలను ఇంటికే పంపిస్తున్నట్లు తెలిపారు. కంటి వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు కార్యక్రమ సీఐవో మంజునాథ, సభ్యులు డాక్టర్ రామకృష్ణ, జగదీశ్వర్, ప్రదీప్కుమార్, అగాపురా మెడికల్ ఆఫీసర్ ఉమేరా సమ్రీన్, కంటి వెలుగు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, డీఏవో నవీన్, రాములు, శ్రీనివాస్, యాదగిరి, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.