మేడ్చల్, జనవరి 9(నమస్తే తెలంగాణ): మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది తెలంగాణ సర్కారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటునందిస్తున్నది. చేప పిల్లల పంపిణీతో పాటే రొయ్యలను నీటిలో వదిలే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా మేడ్చల్ జిల్లాలోని మొదటి దశలో నాలుగు చెరువులను గుర్తించగా, మొత్తం 5 లక్షల 60 వేల రొయ్య పిల్లలను వదిలేందుకు నిర్ణయించి..ప్రక్రియ ప్రారంభించారు. ఎదులాబాద్ చెరువులో లక్ష 69 వేలు, యాద్గార్పల్లి చెరువులో 21,430 వేలు, శామీర్పేట్ చెరువులో 3లక్షల 60 వేల రొయ్యలను వదలగా, లక్ష్మాపూర్ చెరువులో 20 వేల రొయ్యపిల్లలను త్వరలోనే వదలనున్నట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. కాగా, 2021-22 సంవత్సరానికి గాను జిల్లాలోని 414 చెరువుల్లో 96 లక్షల చేప పిల్లలను వదిలారు.
మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు..
జిల్లాలో 51 ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా, 2652 మంది సభ్యులున్నారు. మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు. ఇటీవలే ఆ సంఘాల సభ్యులకు రాయితీపై సంచార వాహనాలు ప్రభుత్వం అందించిన విషయం తెలిసిందే. వీటి ద్వారా చేపలు విక్రయిస్తూ..వారు లాభాలు గడిస్తున్నారు.