సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ):నగరంలో మహిళలకు పోకిరీల బెడద పెరుగుతోంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న కొన్ని ఘటనలతో గడపదాటి బయటకొచ్చి తిరిగి ఇల్లు చేరేవరకు ఆకతాయిల బెడదతో మనోవేదన అనుభవిస్తున్నారు. సోషల్మీడియా, బహిరంగ ప్రదేశాల్లో పోకిరీల వేధింపులపై గతంలో నెలకు 50 వరకు ఫిర్యాదులు వస్తే ఈ మధ్యకాలంలో ఈ ఫిర్యాదుల సంఖ్య వంద దాటుతోంది.
షీ బృందాల నిఘాతో రోజుకు ముగ్గురు నుంచి నలుగురు పట్టబడుతున్నారు. వేధింపులకు గురైన బాధితురాలు దాని నుంచి బయటపడేందుకు కనీసం మూడునెలల సమయం పడుతున్నదని షీటీమ్స్ అధికారి ఒకరు చెప్పారు. మహిళలు నగరంలో తిరగాలంటేనే భయపడిపోతున్నారు. షీటీమ్స్ ఇంతగా నిఘా పెట్టినా గత రెండేండ్లుగా పోకిరీల వేధింపుల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. షీటీమ్స్ నిఘాలో కొన్ని ఘటనలే వెలుగుచూస్తున్నప్పటికీ మరికొందరు మహిళలు తమ సమస్య చెప్పడానికి ఇష్టపడక, బయటకు చెబితే తమ కుటుంబాలకు ఏం సమస్య వస్తుందోనంటూ భయపడుతున్నారు.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా మహిళలు, పిల్లల రక్షణ, భద్రత లక్ష్యంగా పనిచేస్తున్న షీటీమ్స్లోని వివిధ విభాగాలకు గత నెలలో 102 ఫిర్యాదులందాయని షీటీమ్స్ డీసీపీ డాక్టర్ లావణ్య ఎన్జేపీ తెలిపారు. మరోవైపు బహిరంగప్రదేశాల్లో మహిళలను వేధించడం, దురుసుగా ప్రవర్తించిన 127 మందిని పట్టుకున్నామని, 14 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని ఆమె పేర్కొన్నారు.
సమస్యాత్మక బహిరంగప్రదేశాల్లో షీటీమ్స్ నిఘాలో భాగంగా ఈవ్టీజింగ్, వేధింపులపై పలు ఘటనలను గుర్తించామని, ఈ ప్రత్యేక ఆపరేషన్ల సమయంలో మహిళలను తాకుతూ, అనుచితంగా ప్రవర్తించిన ఆరుగురు వ్యక్తులను, చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు ట్రాన్స్జెండర్లను గుర్తించారు.
నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని వారిపై పెట్టీ కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. మహిళల భద్రత, చట్టపరమైన నిబంధనలు, సైబర్ భద్రత తదితర అంశాలపై మొత్తం 1267 అవగాహన కార్యక్రమాలు చేపట్టామని ఆమె చెప్పారు. మెట్రోలు, బస్స్టాపులు, కాలేజీలు, ఇన్స్టిట్యూట్ల వద్ద పోకిరీల బెడద ఉంటున్న నేపథ్యంలో షీటీమ్స్ ఆయా ప్రాంతాల్లో నిఘా పెట్టి వాళ్లను పట్టుకుంటుందని డీసీపీ లావణ్య తెలిపారు.