సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): అతివల జోలికి వస్తే తాట తీస్తామంటున్నది షీ టీమ్స్. జనసందోహం వద్ద నిఘా వేసి.. ఆకతాయిల ఆటకట్టిస్తున్నది. నిమజ్జనం రోజు పోకిరీలను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏకంగా 103 కేసులు నమోదు చేశారు. గతంలో జరిగిన నిమజ్జనాల్లో 70 కేసులు ఉంటే.. ఈసారి మరింత ఎక్కువగా నమోదయ్యాయి. ట్యాంక్బండ్, ఎన్టీఆర్మార్గ్, నెక్లెస్రోడ్డు, సంజీవయ్యపార్కు పరిసరాల్లో ఆ రోజు ప్రత్యేక నిఘా వేయడంతో వెకిలి చేష్టలు చేస్తున్న వారు అడ్డంగా దొరికిపోయారు. ఇక ఆదివారం ట్యాంక్బండ్పై ప్రజలు ఉల్లాసంగా గడిపేందుకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వాహనాలకు నో ఎంట్రీ ఇచ్చారు. దీంతో కుటుంబసమేతగా సండే రోజు నగరవాసులు తరలివస్తున్నారు.
ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం షీటీమ్స్ అక్కడే తిష్ట వేసి ఉంటున్నది. ఆదివారం జరిగిన సందడిలో తప్పటడుగులు వేసిన 12 మంది ఆకతాయిలను పట్టుకున్నారు. వారి చేష్టలను రికార్డు చేసి, వెంటనే పోలీస్స్టేషన్లకు తరలించారు. అందులో కొందరు మైనర్లు కూడా ఉన్నారు. పట్టుబడ్డ వారి వ్యవహారమంతా రికార్డు కావడంతో న్యాయస్థానం వారికి పక్కాగా శిక్షలు విధిస్తుంది. కాగా, మహిళలు, యువతులు, చిన్నారులను వేధిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తున్న పోలీసులు.. ప్రతి ఆదివారం ట్యాంక్బండ్పై జరిగే సందడిలోనూ షీ టీమ్స్ మఫ్టీలో నిఘా కొనసాగుతున్నదని చెప్పారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే షీ టీమ్స్ను ఆశ్రయించడం, లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.