హిమాయత్నగర్, ఫిబ్రవరి 22 : తమ మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పలువురు ట్రాన్స్ జెండర్స్ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఇటీవల మహబూబాబాద్లో నిర్వహించిన పాదయాత్రలో అక్కడి ఎమ్మెల్యే శంకర్నాయక్ను ఉద్దేశించి కొజ్జా అనే పదాన్ని షర్మిల వాడటాన్ని తీవ్రంగా ఖండించారు.
బుధవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ట్రాన్స్ జెండర్ సంక్షేమ బోర్డు సభ్యురాలు రచన ముద్ర బోయిన, తెలంగాణ ట్రాన్స్ జెండర్ పీపుల్స్ అసోసియేషన్ ప్రతినిధి మోనాలిసా, ప్రేమజ్యోతి ఫౌండేషన్ ప్రతినిధి అవంతిక, అస్థిత్వం ఫౌండేషన్ ప్రతినిధి విష్ణుతేజ, ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ వ్యవస్థాప కురాలు జాస్మిన్ మాట్లాడుతూ రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో తమను అవమానపరిచే విధంగా పదాలు వాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ‘మీ రాజకీయాల కోసం మమ్ముల్ని తిట్టడమెందుకు మా చరిత్ర తెలుసుకుంటే మంచిది అని’ హితవు పలికారు. షర్మిల తమపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ట్రాన్స్ జెండర్స్ ప్రతినిధులు నందితశేఖర్, కృష్ణమ్మ, నీతు నాంపల్లి, సైమన్బందేలా, అంజలి పాల్గొన్నారు.