హైదరాబాద్ : కేజీ నుంచి పీజీ వరకు వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వాకటి కరుణ, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, వర్ట్యుసా హైదరాబాద్ ఫెసిలిటీ హెడ్ శ్రీ కృష్ణ ఏదుల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్ ల్యాబ్స్ ఛైర్మన్ జయంత్ ఠాగోర్, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్ మాదిరెడ్డి, కరస్పాండెంట్ జ్యోత్స్న అంగారాతో పాటు పలువురు పాల్గొన్నారు.
నిరుపేద విద్యార్థులకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే మహోన్నత సంకల్పంతో శారదా విద్యాలయ గ్రూప్ను 1922లో వై సత్యనారాయణ ఏర్పాటు చేసినట్లు విద్యాలయ యాజమాన్యం తెలిపింది. ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అప్పటి హైదరాబాద్ నిజాం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పాల్గొన్నట్లు పేర్కొంది. అత్యంత పురాతనమైన, లాభాపేక్షలేని విద్యాలయంగా ఖ్యాతి గడించిన శారదా విద్యాలయలో కేజీ నుంచి పీజీ వరకూ విద్యాబోధన సాగుతుందని వెల్లడించారు.
దాదాపు 1450 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత బాలికల కోసమే దీనిని ప్రారంభించినా అనంతర కాలంలో అబ్బాయిలకు ఇక్కడ విద్యా బోధన అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యాసంస్థలో 62 శాతం మంది బాలికలు ఉన్నారు. నిరుపేద చిన్నారులకు విద్యనందించడంలో అందిస్తున్న తోడ్పాటుకుగానూ 2018లో ప్రైడ్ ఆఫ్ తెలంగాణా అవార్డునూ అందుకుంది.
అవిశ్రాంతంగా వందేళ్లుగా మెరుగైన విద్యాబోధనను పాతబస్తీ విద్యార్థులకు అందిస్తున్న శారదా విద్యాలయ విప్లవాత్మక ఆవిష్కరణలకు వేదికగా మారింది. డిజిటల్ తరగతులను నాల్గవ తరగతి లోపు విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 1.36 ఎకరాల విస్తీర్ణంలో ఆట స్థలాన్నీ విద్యార్ధులకు అందుబాటులో తీసుకొచ్చి ఫిజికల్ ఎడ్యుకేషన్కూ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
శతాబ్ది ఉత్సవాల వేడుకల సందర్భంగా వందేళ్ల విద్యాలయ ప్రస్ధానంలో కీలక మైలురాళ్లతో ఓ ఫోటో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఈ గ్యాలరీని ముఖ్యఅతిథి కరుణ ప్రారంభించారు. దీంతో పాటుగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను ఆమె సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు.