శంషాబాద్, ఆగస్టు 27 : తెలంగాణ తల్లి మెడలో ‘పచ్చల’హారం వేయాలని సంక్పలించింది రాష్ట్ర ప్రభుత్వం. హరితం.. సతతం.. జీవం నినాదంతో రాష్ర్టాన్ని పచ్చటి తెలంగాణగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నది. ఇందులో భాగంగా.. పట్టణ ప్రగతి కార్యక్రమంతో శంషాబాద్ మున్సిపల్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. హరితహారంలో నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పార్కులు పర్యాటకులను ఆకర్శిస్తున్నాయి. పట్టణంలో 25 వార్డులు ఉండగా.. గతేడాది సుమారు రూ. 2 కోట్ల నిధులు వెచ్చించి 10 పార్కులు, ఐదు నర్సరీలను ఏర్పాటు చేశారు. పార్కుల్లో పిల్లలు ఆడుకోవడానికి, వాకర్స్ కోసం సకల వసతులు కల్పించారు.
అంతేకాకుండా ఐదు నర్సరీల్లో 2.5లక్షల మొక్కలు పెంచుతుండగా.. మరో 1.5 లక్షల మొక్కలను బయటినుంచి తెప్పించి మున్సిపల్ పరిధిలో విస్తృతంగా నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదేవిధంగా నాటిన ప్రతి మొక్కను పెంచి పెద్ద చేసేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి మొక్కకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయడంతో పాటు నీటి సౌకర్యం కోసం ట్యాంకర్ను సైతం ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మారెడ్డి, కమిషనర్ సాబేరలి పర్యవేక్షణలో కౌన్సిలర్లు, సిబ్బంది మొక్కల సంరక్షణకు తగిన చర్యలు చేపడుతున్నారు. పట్టణ ప్రజలు హరితహారం కార్యక్రమంలో భాగస్వాములయ్యే విధంగా చైతన్య పరుస్తున్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు మల్టీ లేయర్ పైలట్ ప్రాజెక్టు కింద శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎయిర్పోర్టు కాలనీ పార్కును అభివృద్ధి చేశారు. నిరుపయోగంగా ఉన్న ఈ ప్రాంతంలో సుమారు 30 రకాల మొక్కల పెంపకంతో ఆహ్లాదకరంగా మారింది. తీరొక్క రకాల పూల మొక్కలు ఇక్కడికి వచ్చేవారిని ఆకట్టుకుంటున్నాయి.
శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని పార్కులు, నర్సరీలు, రహదారుల్లో పచ్చదనం పరిడవిల్లుతున్నది. సాతం రాయిలోని మియావాకి, మెహిది గార్డెన్, మహానగర్, మధురానగర్, ఎయిర్పోర్టు కాలనీ, వీఎన్ఆర్ పార్కు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పార్కుల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లు, పిల్లల ఆట వస్తువులకు విషేశ ఆదరణ లభిస్తున్నది. త్వరలోనే మరో 15 వార్డుల్లో పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
శంషాబాద్ మున్సిపల్ను హరితహారంలో ఆదర్శంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రతి ఇంటినీ నందనవనంలా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ప్రధానంగా ఇంటింటికి తిరిగి మొక్కల పెంపకం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న వారిని గుర్తించి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తూ చైతన్య పరుస్తున్నాం. నగర దీపికల సహాయంతో ప్రతి వీధిలో మొక్కలు నాటుతున్నాం. మొక్కల పెంపకం, సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్నది. – సుష్మారెడ్డి, శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్
మున్సిపల్లోని 25 వార్డులకు గాను 10 వార్డుల్లో పార్కులు ఏర్పాటు చేశాం. మిగతా 15 వార్డుల్లో దశలవారీగా పార్కులు ఏర్పాటు చేస్తాం. నాటిన ప్రతి మొక్క పెరిగి పెద్దయ్యేలా చర్యలు చేపడుతున్నాం.- సాబేరలి, మున్సిపల్ కమిషనర్
యువతతో పాటు అన్ని వర్గాల వారు హరితహారంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భావితరాలకు బంగారు భవిష్యత్తును ఇచ్చే బృహత్తర కార్యక్రమం ఇది.- పవన్, స్థానికుడు, శంషాబాద్.