Shamirpet | మేడ్చల్ జిల్లా పరిధిలోని శామీర్పేటలో శనివారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నట్లు వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. కాల్పులకు కారణం వివాహేతర సంబంధం అని, కాల్పులకు తెగబడింది ఓ సీరియల్ నటుడు అంటూ వార్తలు వెలువడ్డాయి. అసలు ఆ కాల్పుల కథేంటి.. నిజనిజాలు ఏంటో చూద్దాం..
ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన సిద్ధార్థ్ దాస్, స్మితా గ్రంథి అనే మహిళతో కొన్నేండ్ల క్రితం వివాహమైంది. సిద్ధార్థ్ దాస్ విశాఖలోని హిందూజా థర్మల్ పవర్లో మేనేజర్గా పని చేస్తున్నాడు. స్మితా సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పని చేస్తుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. స్మితా, సిద్ధార్థ్ మధ్య మనస్పర్థలు తలెత్తడంతో.. 2019 నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. తన భర్తకు దూరంగా ఉంటున్న స్మితా గ్రంథి.. విడాకుల కోసం కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
సిద్ధార్థ్ నుంచి విడిపోయిన స్మితా.. శామీర్పేటలోని సెలబ్రెటి విల్లాలో మనోజ్ కుమార్తో సహజీవనం చేస్తోంది. మనోజ్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. భర్తకు దూరంగా ఉంటున్న స్మితా.. తన ఇద్దరు పిల్లలను తన వద్దే పెట్టుకుంది. కుమారుడు కూకట్పల్లిలోని ఫిడ్జ్ కాలేజీలో 12వ తరగతి చదువుతుండగా, కూతురు శామీర్పేటలోని శాంతినికేతన్ రెసిడెన్షియల్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది.
అయితే మనోజ్ కుమార్ తమను వేధిస్తున్నట్లు స్మితా కుమారుడు ఆరోపించాడు. ఇటీవలే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి స్మితా కుమారుడు ఫిర్యాదు చేశాడు. తనను హింసించిన మాదిరిగానే తన చెల్లిని కూడా మనోజ్ కొడుతున్నాడని, తాము తల్లి వద్ద ఉండలేం అని పేర్కొన్నాడు. తమ తల్లి తరపు బంధువుల వద్ద కూడా ఉండలేం. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కుమారుడు విజ్ఞప్తి చేశాడు. ఇదే విషయాన్ని తమ తండ్రి సిద్ధార్థ్ దాస్కు పిల్లలు తెలిపారు.
మనోజ్ కుమార్, స్మితా కలిసి తన పిల్లలను సరిగా చూసుకోవడం లేదని తెలుసుకున్న సిద్ధార్థ్ దాస్.. శనివారం ఉదయం శామీర్పేటలోని సెలబ్రెటీ విల్లాకు చేరుకున్నాడు. అక్కడ మనోజ్తో సిద్ధార్థ్ దాస్కు గొడవ జరిగింది. ఈ క్రమంలో మనోజ్.. సిద్ధార్థ్ను బెదిరించడానికి ఎయిర్ గన్తో కాల్పులు జరిపాడు. అందులో పిల్లెట్స్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సిద్దార్థ్ 100కు డయల్ చేసి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మనోజ్, స్మితను అదుపులోకి తీసుకొని ఎయిర్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సిద్ధార్థ్ దాస్పై కాల్పులు జరిపింది కార్తీక దీపం నటుడు మనోజ్ కుమార్ అని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో కార్తీకదీపం సీరియల్ నటుడు మనోజ్ కుమార్ స్పందించారు. గతంలో కార్తీక దీపం సీరియల్లో నటించాను. ఇప్పుడు మౌన పోరాటం సీరియల్లో నటిస్తున్నాను. కొన్ని మీడియా సంస్థలు.. కాల్పులు జరిపింది తానే అని ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తాను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నానని చెప్పారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు మనోజ్ కుమార్ ఓ వీడియోను విడుదల చేశారు.