బేగంపేట్, ఏప్రిల్ 8: పైలెట్ శిక్షణ తీసుకుంటున్న ఓ యువతిపై ఇన్స్ట్రక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బేగంపేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన యువతి(20) బేగంపేట్లోని ఓ పైలెట్ ట్రేనింగ్ కేంద్రంలో శిక్షణ కోసం 2025లో చేరింది. ఆ సమయంలో అక్కడ ఇన్స్ట్రక్టర్గా విధులు నిర్వహిస్తున్న కేరళ రాష్ట్రం కొట్టాయంకు చెందిన నసీముద్దీన్ అలియాస్ నసీం(30)తో పాటు సల్మాన్ సలీం(45)లతో ఆమెకు పరిచయం ఏర్పడింది. నసీముద్దీన్ తనను ఒక సోదరుడిగా, సల్మాన్ సలీం ఒక తండ్రిగా ఆ యువతి భావించింది. వారితో సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది.
ఈ చనువుతో బేగంపేట్ బ్రాహ్మణవాడిలో ఉండే నసీముద్దీన్ వద్దకు చదుపుకోవడానికి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 27న సాయంత్రం ఆమె నసీముద్దీన్ వద్దకు వెళ్లింది. కాగా, నసీముద్దీన్ ఫుట్బాల్ మ్యాచ్కు వెళ్లి తిరిగి అర్ధరాత్రి 12గంటలకు వచ్చాడు. అప్పటి వరకు ఆ యువతి అక్కడే చదువుతూ ఉంది. అతడు రాగానే తాను తన స్నేహితురాలి వద్దకు వెళ్తానని చెప్పడంతో వద్దు ఇక్కడే ఉండాలి అని పట్టుపట్టాడు. తన జీవితం గురించి చెబు తూ.. అసభ్యకరంగా ప్రవర్తించాడు.
బాధితురాలు అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా, లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే పరువు తీస్తానని, కుటుంబానికి హాని కలిగిస్తానని బెదిరించాడు. అనంతరం ఆ తర్వాత చదువు కోసం దమ్మాయిగూడలో ఉంటున్న మరో ఇన్స్ట్రక్టర్ సల్మాన్ ఇంటికి వెళ్తుండేది. నసీముద్దీన్ అక్కడికి మకాం మార్చి అక్కడ కూడా బెదిరించడం మొదలుపెట్టాడు. వేధింపులు అధికమవ్వడంతో బాధితురాలు బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నసీముద్దీన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.