సిటీబ్యూరో, మే 10(నమస్తే తెలంగాణ): ఆన్లైన్ వేదికగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు ప్రాంతాల్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న మూడు వేర్వేరు ముఠాలకు చెందిన ఏడుగురు బుకీలను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.కోటి 84లక్షల నగదుతో పాటు 36 సెల్ఫోన్లు, 3 ల్యాప్టాప్లు, ఒక ట్యాబ్, జియో రూటర్ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసు వివరాలు వెల్లడించారు. బెంగళూర్కు చెందిన గణపతిరెడ్డి, ఏపీలోని ఈస్ట్గోదావరి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరాజుతో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో పెద్దఎత్తున క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నాడు.
ప్రధాన బుకీ అయిన గణపతిరెడ్డి నగరంలోని ఎస్ఆర్నగర్లో నివాసముంటున్న సబ్ బుకీ పొడపాటి నర్సింగ్రావు వద్ద డబ్బులు తీసుకుని కొన్ని యాప్లకు యాక్సెస్ ఇచ్చాడు. దీంతో నర్సింగ్రావు ఫంటర్ల వద్ద డబ్బులు తీసుకుని వారికి సదరు యాక్సెస్కు సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ను ఇస్తాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటకలో పెద్దఎత్తున క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ ఫోన్-పే, గూగుల్-పే, పేటీఎంల ద్వారా డబ్బు మార్పిడి జరుపుతున్నారు. ఈ మేరకు నిఘా పెట్టిన శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు మంగళవారం రాత్రి నర్సింగ్రావును చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.60లక్షల నగదు సీజ్ చేయడంతో పాటు బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.32లక్షల డబ్బును ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో మొత్తం రూ.92లక్షల సొత్తు సీజ్ చేసి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులైన గణపతిరెడ్డి, శ్రీనివాసరాజులు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు.
రాజేంద్రనగర్ జోన్ పరిధిలో..
ఏపీలోని భీమవరానికి చెందిన వెగసిన రవిరాజు(45), భూపతిరాజు(40) గత కొన్ని రోజులుగా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతూ పెద్దఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు. నిఘా పెట్టిన రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు బండ్లగూడ జాగీర్ వద్ద నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.71,50,000 నగదు స్వాధీనం చేసుకుని, రూ.7,37,000 బ్యాంకు బ్యాలెన్స్ను ఫ్రీజ్ చేశారు. 17 సెల్ఫోన్లు, రెండు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం రూ.81లక్షల సొత్తును సీజ్ చేశారు.
బాలానగర్ జోన్ పరిధిలో..
నార్సింగికి చెందిన సబ్ బుకీ కె.వినోద్కుమార్(32), వనపర్తికి చెందిన సబ్ బుకీ శ్రీకాంత్రెడ్డిలు ప్రధాన బుకీ అయిన భీమవరానికి చెందిన లింగం అలియాస్ లింగరాజు నుంచి బెట్టింగ్ యాప్ల ద్వారా యాక్సెస్ తీసుకుని నగరంలో బెట్టింగ్కు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్వోటీ పోలీసులు వినోద్కుమార్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.7,52000 నగదు, 17సెల్ఫోన్లు, ఒక ట్యాబ్, రూటర్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం రూ.11లక్షల విలువైన సొత్తును సీజ్ చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు శంషాబాద్, రాజేంద్రనగర్, బాలానగర్ జోన్ డీసీపీలు నారాయణరెడ్డి, జగదీశ్వర్రెడ్డి, టి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో శంషాబాద్ జోన్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, రాజేంద్రనగర్ జోన్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, బాలానగర్ ఎస్వోటీ బృందం ఈ కేసులు దర్యాప్తు చేస్తున్నారు.