పీర్జాదిగూడ, జనవరి 17: నిరుద్యోగ యువతీ యువకులకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సెట్విన్ కేంద్రం ఎంతో దోహదపడుతున్నది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయించాలని తపనతో స్థానిక మేయర్ జక్కా వెంకట్రెడ్డి నేతృత్వంలో పలు వృత్తి శిక్షణ కోర్సుల్లో నైపుణ్యం కల్పించేందుకు సెట్విన్ కేంద్రం ఏర్పాటు చేయించారు. యువత తమ కాళ్లపై తాము నిల బడేందుకు పలు వృత్తి విద్యా కోర్లుల్లో శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతుంది.
గడిచిన ఏడాది కాలంలో పలు కోర్సుల్లో 1229 ఉపాధి శిక్షణ ఇచ్చింది. ఎంతో మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మహిళలు ఆయా విభాగాల్లో నామమాత్రపు ఫీజులకే శిక్షణనిస్తూ సరిఫికెట్లు ఇవ్వడమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఈ స్వంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సెట్విన్( సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్) సంస్థను పీర్జాదిగూడ కార్పొరేషన్లోని మేడిపల్లిలో సెట్విన్ కేంద్రం ఏర్పాటు చేసి ఉపాధిని అందిస్తున్నందున యువత, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంలో అందించే కోర్సులు
ఈ కేంద్రంలోఅందుబాటులో ఉన్న కోర్సులు వెబ్ డిజైన్, అకౌంటింగ్ ప్యాకేజ్, ఒరాకిల్,మల్టీమీడియా, స్పోకెన్ ఇంగ్లిష్, ఆర్ అండ్ ఏసీ, మొబైల్ సర్వీసింగ్, నర్సింగ్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, జూట్, పేపర్, క్లాత్ బ్యాగ్స్ మేకింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్, టైలరింగ్, టెక్స్టైల్స్ డిజైనింగ్, బ్యూటీషియన్, హెయిర్ డ్రెస్సింగ్, మగ్గం వర్క్, వివిధ విభాగాల్లోశిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కేంద్రంలో ఆయా విభాగాల్లో నిష్టాతులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఇస్తున్నారు. ఈ కేంద్రంలో షార్ట్ టైం, లాంగ్టైమ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. పీర్జాదిగూడకార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న వారికి సెట్విన్ సెంటర్లో శిక్షణ పొందేవారికి 50 శాతం రాయితీ అవకాశం కల్పిస్తున్నారు. ఈ సెట్విన్ సెంటర్లో శిక్షణ పొందేందుకు పరిసర జిల్లాల నుంచి కూడా వస్తున్నారు.
నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నాం..
శిక్షణకు ఎంపికైన వారిలోని ప్రతిభను గుర్తించి ఆయా రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నాం. అధికంగా డిమాండ్ ఉన్న పలు రకాల కోర్సుల్లో అవసరమైన మెళకువలను నేర్పేందుకు నిష్ణాతులైన ప్యాకల్టీలతో శిక్షణ ఇప్పిస్తున్నాం..పరిసర ప్రాంతాలే కాకుండా మేడ్చల్, యాదాద్రి ,భువనగిరి జిల్లాలోని నిరుద్యోగ యువత సెట్విన్ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి వరకు 1227 మంది మహిళలు, యువత శిక్షణ పొందారు. మరిన్ని కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-సెట్విన్ కేంద్రం ఇన్చార్జి,వనజ
యువత సద్వినియోగం చేసుకోవాలి
ఉన్నత చదువులకు దూరమైన నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వావలంబన కోసమే సెట్విన్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేశాం. నిరుద్యోగ యు వతతో పాటు మహిళలకు పలు వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో సెట్విన్ సెంటర్ను పీర్జాదిగూడ మేడిపల్లిలో ఏర్పాటు చేయించాం. ఈ సంస్థలో శిక్షణ పొందితే ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ సెట్విన్ కేంద్రం అందించే శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలి.
–పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్, జక్క వెంకట్రెడ్డి