దుండిగల్, జనవరి 23 : కనీస భద్రత లేని హాస్టల్స్ను టార్గెట్ చేసుకుని ల్యాప్టాప్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులను బాలానగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు, దుండిగల్ పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి రూ.10లక్షల విలువ చేసే 20 ల్యాప్టాప్లు, రెండు సెల్ఫోన్లతో పాటు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. నిందితుల్లో ఒకరు ఇంజినీరింగ్ విద్యార్థి కావడం గమనార్హం. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం ప్రాంతానికి చెందిన ఈశ్వరయ్య కొడుకు అపాల బాలాజీ(20) దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. చెడు వ్యసనాలకు బానిసగా మారిన బాలాజీ తన అవసరాలు తీర్చుకునేందుకు దొంగగా మారాడు. విద్యార్థులు అధికంగా ఉంటున్న హాస్టల్స్ను గుర్తించి, అందులో భద్రత సరిగా లేని గదులను ఎంచుకునే వాడు. ఇదిలా ఉండగా గండిమైసమ్మ పరిసర ప్రాంతాల్లోని పలు హాస్టల్లోకి వెళ్లి తాను స్టూడెంట్నంటూ నిర్వాహకులను నమ్మించేవాడు. అనంతరం తాళం వేసి ఉన్నగదులను గుర్తించి తనవద్ద ఉన్న పానాలు(స్పానర్లు), ఇతర వస్తువులతో తలుపులు తెరిచి ల్యాప్ట్యాప్లు దొంగిలించే వాడు. మొదట దొంగిలించిన ల్యాప్టాప్ను ‘క్యాషీఫై’అనే యాప్ ద్వారా నగరంలోని హిమాయత్నగర్లో ఉంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన జలౌన్ జిల్లాకు చెందిన రాజ్కుమార్ కుష్వా(20)కు తక్కువ ధరకు విక్రయించాడు. దీంతో ఇరువురి మధ్య పరిచయం పెరిగింది. అదే సమయంలో రాజ్కుమార్ కుష్వా ఉత్తరప్రదేశ్కు చెందిన ‘క్యాషీఫై’డీలర్గా ఉన్న పర్వేశ్కుమార్కు విషయం తెలిపాడు. అతడి సూచనతో బాలాజీ ల్యాప్టాప్లు దొంగిలించి రాజ్కుమార్ కుష్వాకు అప్పగించడం, వాటిని పర్వేష్కుమార్ ‘క్యాషీఫై’ యాప్ద్వారా విక్రయించడం జరుగుతుంది.
వెలుగులోకి వచ్చింది ఇలా..
కాగా ఒక్క జనవరి నెలలోనే గండిమైసమ్మలోని పలు హాస్టల్స్లో 5కు పైగా ల్యాప్టాప్లు చోరీకి గురైనట్లు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పాటు మియాపూర్, జీడిమెట్ల, కూకట్పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటుండటంతో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాలానగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు, దుండిగల్ పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గండిమైసమ్మ చౌరస్తా వద్ద నిందితుడు అపాల బాలాజీ ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఓ ల్యాప్టాప్తో పాటు స్పానర్లు లభించాయి. దీంతో బాలాజీని తమదైనశైలీలో విచారించగా అసలు విషయం వెల్లడించాడు. దీంతో హిమాయత్నగర్లోని అడ్వకేట్స్ కాలనీలో ఉంటున్న రాజ్కుమార్కుష్వా ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా మరో 19 ల్యాప్టాప్లు దొరికాయి. ఇరువురిని అరెస్ట్చేసిన పోలీసులు వారి నుంచి రెండు సెల్ఫోన్లు, 20ల్యాప్టాప్లతో పాటు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. మరో నిందితుడు పర్వేష్కుమార్ పరారీలో ఉన్నాడు.