ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 28: ఉస్మానియా యూనివర్సిటీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ను గురువారం నిర్వహించిన అకాడమీ సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఓయూ బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ.718.86 కోట్లుగా చూపెట్టారు. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ. 32.91 కోట్ల ఓపెనింగ్ బ్యాలెన్స్తో కలిపి మొత్తం రూ.751.77 కోట్ల నిధులు అందుబాటులో ఉండగా, వ్యయం రూ.796.45 కోట్లుగా చూపెట్టారు. రూ.44.68 కోట్ల లోటుతో బడ్జెట్ను ఆమోదించారు.
ఇందులో ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్ రూ.487.03 కోట్లు, మిగిలిన నిధులను యూనివర్సిటీ అంతర్గతంగా సమకూర్చుకోనుంది. ఓయూ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్లో అకాడమిక్ సెనేట్ జరిగిన సమావేశంలో వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను చదివి వినిపించారు. ఈ నివేదికలో గత సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకున్న ప్రత్యేక చర్యలు, తదితర వాటిని వివరించారు.
యూనివర్సిటీ నిర్వహించనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ల గురించి పేర్కొన్నారు. అనంతరం ఓయూ కామర్స్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ వి.అప్పారావు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదించారు. ఓయూకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి రూ.487.03 కోట్ల బ్లాక్ గ్రాంట్ మంజూరు కాగా, గతేడాది ఓపెనింగ్ బ్యాలెన్స్ రూ.32.91 కోట్లుగా ఉంది. యూనివర్సిటీ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ బకాయిలు చెల్లించేందుకు ప్రత్యేక గ్రాంటు రూపంలో ప్రభుత్వం నుంచి రూ.55.00 కోట్లు మంజూరైంది. మిగిలిన మొత్తం వర్సిటీ భరించాల్సి ఉంటుంది.
ఇందులో రూ.35.63 కోట్లు అంతర్గత ఆదాయాల ద్వారా, ఎగ్జామినేషన్ బ్రాంచ్, యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్, పీజీఆర్ఆర్సీడీఈ, డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్, డైరెక్టరేట్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్, టీఎస్పీజీఈటీ కన్వీనర్ తదితర సంస్థల నుంచి నిధుల మళ్లింపు ద్వారా రూ.138.50 కోట్లు, లోన్లు, అడ్వాన్సుల వసూల ద్వారా రూ.2.70 కోట్లు సమకూర్చుకుంటామన్నారు. మొత్తం బడ్జెట్లో అధ్యాపకులు, ఉద్యోగుల వేతనాలకు రూ.451.28 కోట్లు కాగా, పెన్షన్లకు రూ.295.00 కోట్లు కేటాయించారు. అదే విధంగా ఆకస్మిక అవసరాలకు రూ.47.17 కోట్లు, ఉద్యోగుల లోన్లకు రూ.3.0 కోట్లు కేటాయించారు.
యూనివర్సిటీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో సింహ భాగం ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ చేసిన వారి పెన్షన్లకే సరిపోతోంది. ఉద్యోగుల వేతనాలకు రూ.451.28 కోట్లు అవసరముండగా, ఇది వర్సిటీ మొత్తం బడ్జెట్లో 56.66 శాతం కావడం గమనార్హం. అదే విధంగా పెన్షన్లకు మరో రూ.295.00 కోట్లు కేటాయించగా, ఇది 37.04 శాతంగా ఉంది. మిగిలినదాన్లో 5.92 శాతం కాంటింజెన్సీకి, 0.38 శాతం ఉద్యోగుల రుణాలకు కేటాయించారు. అయితే, వేతనాలు, పెన్షన్లకు మొత్తం బడ్జెట్లో 93.7 శాతం పోతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ శాతం 65.75గా ఉండగా, ఉద్యోగులకు వేతనాలు పెరిగిన దృష్ట్యా వర్సిటీపై మరింత భారం పడింది.