సిటీబ్యూరో, మార్చ్ 31(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో ఈనెల 2న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జరగనున్న శ్రీ వీరహనుమాన్ విజయయాత్రను ప్రశాంతంగా, దిగ్విజయవంతంగా నిర్వహించేందుకు నగర పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర ఏర్పాట్లపై బుధవారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సీపీ సజ్జనార్ అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖలు, ఉత్సవ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఇటీవల శ్రీరామనవమి శోభాయాత్రను అన్ని శాఖల సహకారంతో విజయవంతంగా పూర్తిచేశామని, అదే విధంగా హనుమాన్ విజయయాత్రను కూడా శాంతియుతంగా జరిగేలా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈసారి ప్రధాన యాత్రంలో సుమారు 168 శోభాయాత్రలు కలువనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3వేల మంది పోలీసు సిబ్బందితో పాటు అదనపు సాయుధ బలగాలు, టాస్క్ఫోర్స్ బృందాలను కీలక ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు వెల్లడించారు.
యాత్ర నిర్వహణలో వాలంటీర్లకు తగిన శిక్షణ ఇచ్చి, రోప్ పార్టీ సభ్యులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. యాత్రలో కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని, నిర్ణీత మార్గాల్లోనే యాత్ర సాగేలా చూడాలని, ఫ్లై ఓవర్లు, రైల్వే బ్రిడ్జిల దృష్ట్యా విగ్రహాల ఎత్తు విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా మళ్లింపులు చేపడతామని, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
సమావేశం అనంతరం సీపీ సజ్జనార్ గౌలిగూడ రామమందిరంలో స్వామివారిని దర్శించుకుని అక్కడి నుంచి తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఉన్న 12 కిలోమీటర్ల యాత్ర మార్గాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహామూర్తి, పలు హిందూ సంఘాల ప్రతినిధులు రామరాజు, శ్రీకాంత్, రావినూతన శశిధర్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ నుంచి డీసీపీ వైవీఎస్ సుధీంద్ర, మల్కాజిగిరి కమిషనరేట్ నుంచి డీసీపీ సీహెచ్శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.