కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిలటరీ అధికారులు చివరకు తాగునీటి బోర్లపైనా ప్రతా పం చూపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సాయన్న తన నియోజకవర్గ అభివృద్ధి నిధులతో తిరుమలగిరి చిన్నకమేళా బస్తీలో బోరు వేయించారు. తెల్లారేసరికి మిలటరీ సిబ్బంది వాలిపోయి కనెక్షన్ తొలగించి బోరును సీజ్ చేశారు. చివరకు మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నా అనుమతి తప్పనిసరని హుకుం జారీ చేస్తున్నారు. అంతేకాదు బస్తీల్లో ఆర్మీ సిబ్బంది నిత్యం తిరుగుతూ ఇబ్బందికి గురిచేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీళ్లు, కరెంటు తీసుకుంటున్న కంటోన్మెంట్ బోర్డు.. రోడ్లు విస్తరించకుండా తరచూ మూసివేస్తూ నరకం చూపిస్తున్నదని ఆవేదన చెందుతున్నారు.
సికింద్రాబాద్/బొల్లారం, మార్చి 17: సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేవంటారు. వాహనదారులను ఇక్కట్ల పాలు చేయడం లేదని వివరణలు ఇస్తారు. ఇష్టానుసారంగా ప్రధానదారులతో పాటు అంతర్గత రోడ్లను మూసివేస్తుంటారు. రక్షణ శాఖ స్థలాల్లో దశాబ్దాల నుంచి పేదలు గూడు వేసుకొని ఉంటున్నారు. కనీస మౌలిక వసతుల కల్పనకు కృషి చేద్దామన్నా..ముందడుగు వేయనివ్వరు. ఇలా స్థానిక మిలటరీ అథారిటీ అధికారులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తుండటంతో స్థానిక బస్తీలవాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.
బోరు వేసినా..
తిరుమలగిరి పరిధిలోని చిన్న కమేలా బస్తీలో ఎమ్మెల్యే సాయన్న తన నిధుల నుంచి బోర్వెల్ వేయించారు. అయితే తెల్లారేసరికి ఆర్మీ అధికారులు అక్కడికి వచ్చి దానిని సీజ్ చేశారు. మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నా..అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఐదో వార్డులోని 108 బజార్లో నివసిస్తున్న బస్తీవాసులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కనీస వసతులు కల్పించేందుకు రాష్ట్ర సర్కారు ముందుకొచ్చినా.. ఆర్మీ అధికారులు అడ్డుపడుతూ వస్తున్నారు. రాష్ట్రం అందించే విద్యుత్, నీళ్లను యథేచ్ఛగా వాడుకుంటున్న అధికారులు.. ఇక్కడే దశాబ్దాల నుంచి ఉంటున్న ప్రజలపై మాత్రం కనికరం చూపకపోవడాన్ని రాష్ట్ర సర్కారు ప్రశ్నించడం ఎలా తప్పవుతుందని స్థానిక ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
మొండి వైఖరి వీడాలి
కంటోన్మెంట్ పరిధిలో జీవిస్తున్న ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా ఆర్మీ అధికారులు పనిచేస్తున్నారు. రక్షణ శాఖ స్థలాల్లో ఏండ్ల నాటి నుంచి నివసిస్తున్న వారిపై కేంద్రం అవలంబిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారుతున్నది. ఓ వైపు రోడ్లు మూసివేత, రోడ్ల విస్తరణకు అడ్డంకిగా మారడం, ఓట్లను తొలగించడం, బజారు స్థలాలను క్రమబద్ధీకరించకపోవడం వంటివి చూస్తుంటే.. కేంద్రానికి పేదలపై ఏ మాత్రం ప్రేమ ఉందో అర్ధమవుతున్నది. ఇప్పటికైనా కేంద్రం మొండి వైఖరిని విడనాడి పేదలకు మేలు జరిగేలా కృషి చేయాలి.
– మర్రి రాజశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి
వేసిన బోరును పూడ్చివేశారు
ఆర్మీ అధికారుల తీరు వల్ల నీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతేడాది ఎమ్మెల్యే సాయన్న బోర్వెల్ పనులు చేపడితే..వేసిన కొద్దిరోజులకు ఆర్మీ అధికారులు రాత్రి రాత్రి వచ్చి బోరును పూడ్చివేశారు. నీటి సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
– సుశీల,చిన్న కమేళా బస్తీవాసి
బోరును తిరిగి ఓపెన్ చేయాలి
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చిన్న కమేళా బస్తీలో నీటి ఎద్దడి నివారణకు బోర్వెల్ పనులు చేపడితే ఆర్మీ అధికారులు మూసివేయడంతో నీళ్లకు ఇబ్బంది అవుతున్నది. ఎండాకాలంలో సమస్య అధికమవుతున్నది. ఆర్మీ అధికారులు ప్రతి రోజు బస్తీని పర్యవేక్షిస్తారు. మరుగుదొడ్లు నిర్మించుకోకుండా అడ్డుపడుతారు. నీటి ఎద్దడి నివారణ సమస్య లేకుండా బోర్వెల్ను తిరిగి ఓపెన్ చేయాలని కోరుతున్నాం. – భాగ్య,చిన్న కమేళా బస్తీవాసి