హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 30వ తేదీన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను నిర్వహించనున్నారు. కంటోన్మెంట్ పరిధిలో 8 వార్డులు ఉన్నాయి. సికింద్రాబాద్ సహా మొత్తం 57 కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాపై బోర్డు అధికార యంత్రాంగం కసరత్తు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తున్నది. 2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది ఫిబ్రవరి 10న పాలకవర్గం కొలువుదీరింది. 2020 ఫిబ్రవరి 10 నాటికి పాలకవర్గం గడువు తీరింది. అనంతరం కేంద్రం నామినేటెడ్ సభ్యుడిని నియమించింది. అయితే, బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై స్పందించాలని న్యాయస్థానాలు కూడా కంటోన్మెంట్ బోర్డును ఆదేశిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసేందుకు గానూ విధి విధానాలపై కొన్నిరోజుల కిందట కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విలీన ప్రక్రియ ఊపందుకుంటుందనుకున్న తరుణంలో తాజాగా బోర్డు ఎన్నికల అంశం తెరపైకి రావడం గమనార్హం.