కంటోన్మెంట్, ఆగస్టు 11: బోర్డు పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల ఊసేలేదు. సివిలియన్ నామినేటెడ్ సభ్యుడి స్థానం ఖాళీగా ఉన్నా న్యాయస్థానాల తీర్పులను సైతం కంటోన్మెంట్ బోర్డు అధికారులు తుంగలో తొక్కుతున్నారు. బుధవారం బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, సీఈఓ అజిత్రెడ్డి ఇరువురే సమావేశమైనారు. కరోనా నేపథ్యంలో మీడియాకు అనుమతి ఇవ్వలేదు. వివిధ విభాగాలకు చెందిన అధికారులు కూడా సమావేశానికి దూరంగా ఉండడంతో ఏం జరిగిందో తెలియక అధికారులే అయోమయంలో పడ్డట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని బోర్డు మాజీ సభ్యులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా బోర్డు ఉన్నతాధికారి స్పందిస్తారో వేచిచూడాల్సిందే..! రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలుగా బోర్డుకు రావాల్సిన నిధులను విడుదల చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం అభివృద్ధి పనులపై చొరవ తీసుకోవడంలో విఫలమవుతున్నారు. బోర్డు ఆదాయం పడిపోతున్నా, రక్షణ శాఖ నుంచి సర్వీస్ చార్జీల రూపేణా రావాల్సిన నిధులను రప్పించడంలో బోర్డు ఉన్నతాధికారులుగా ఉన్న వాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై కంటోన్మెంట్కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని రక్షణ శాఖ నుంచి రావాల్సిన సర్వీస్ చార్జీల నిధులను రాబట్టాలని పలువురు కోరుతున్నారు.