సికింద్రాబాద్, అక్టోబర్ 18: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నేతృత్వంలో నియోజకవర్గానికి చెందిన బోర్డు మాజీ సభ్యులతో పాటు నూతనంగా ఎన్నికైన పార్టీ వార్డు అధ్యక్షులతో మంగళవారం ప్రగతిభవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు. కంటోన్మెంట్లో పార్టీని బలోపేతం చేసే విధంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ఈ నెల 25న జరగనున్న పార్టీ ప్లీనరీకి సంబంధించిన దానిపై చర్చించనున్నారు. నియోజకవర్గంలో రక్షణ శాఖ అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే విధంగా ప్రణాళికను రూపొందించే అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. నూతనంగా వార్డు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఆయా వార్డుల్లో పార్టీని క్షేత్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై వివరించనున్నారు.
మరోవైపు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బోర్డు మాజీ సభ్యులతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కేంద్ర పథకాలు కంటోన్మెంట్లో అమలు కాకున్నా, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కంటోన్మెంట్ వాసులకు అందుతున్న తీరూతెన్నులపై పర్యవేక్షించనున్నారు. ఇటీవల కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న మద్దతుకు సంబంధించి నేతలతో ఆరా తీయనున్నట్లు సమాచారం.
విలీనమైతే బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలు జీహెచ్ఎంసీలో కలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం అందే వీలు ఉండటంతో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉచిత మంచినీరు కంటోన్మెంట్లో సైతం వర్తింపజేయాలనే ప్రతిపాదనను కేటీఆర్ దృష్టికి ఎమ్మెల్యే సాయన్నతో కలిసి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్లీనరీ సమావేశం, నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, రానున్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు, రక్షణ శాఖ రోడ్ల మూసివేత అంశాలపై కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం.