సికింద్రాబాద్, అక్టోబర్ 6: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఇప్పట్లో ఎన్నికలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. నేడు, రేపు అంటూ ఊరిస్తూ వస్తున్న బోర్డు ఎన్నికలు ఈ ఏడాది లేనట్లే తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి గడువు ముగిసింది. రెండు పర్యాయాలు పొడిగించిన నేపథ్యంలో మరోసారి పొడిగించే వీలు లేకపోవడంతో పాటు నూతన కంటోన్మెంట్ -2020 యాక్టు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో 2020 యాక్టు బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినా ప్రస్తుతానికి బిల్లు పెండింగ్లో ఉంది. దీంతో నామినేటెడ్ సభ్యుల ఎంపికకు సంబంధించి కేంద్రం అడుగులు వేస్తుంది.
ఇందులో భాగంగా దేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు ఉండగా 11 కంటోన్మెంట్ బోర్డులకు నామినేటెడ్ సభ్యులను ఎంపిక చేస్తూ గెజిట్ను విడుదల చేసింది. త్వరలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుతో పాటు మిగతా కంటోన్మెంట్లకు నామినేటెడ్ సభ్యుల ప్రక్రియను పూర్తిచేసేందుకు కేంద్రం తుది అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్కు ఎన్నికలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో ఆశావాహుల్లో నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి. త్వరలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన నామినేటెడ్ సభ్యుడి పేరు వెలువడొచ్చనే క్రమంలో నేడు పలువురు కాషాయపు నేతలు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.