కంటోన్మెంట్, ఆగస్టు 25: ఎన్నో ఏండ్లుగా సమస్యలతో సతమతమవుతున్న కంటోన్మెంట్ వాసులు కమిటీ రాకతోనైనా పరిష్కారం లభింస్తుందో లేదోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నిసార్లు రక్షణ శాఖకు విన్నవించుకున్నా సమస్యలను గాలి కొదిలేయడమే తప్ప పరిష్కార మార్గం చూపించింది లేదు. ఈ క్రమంలోనే నేడు బోర్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందం పర్యటించనుంది. ఈ కమిటీ బృందం రాక నేపథ్యంలోనే గత పదిహేను రోజులుగా కమిటీ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై బోర్డు సీఈఓ అజిత్రెడ్డి పలు దఫాలుగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, మాజీ సభ్యులతో చర్చించారు.
పరిపాలన విధానానికి అనేక అంశాల లోపాలను కమిటీకి చెప్పేందుకు నివేదికలు సిద్ధం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో నిత్యం రోడ్ల మూసివేత అంశంతో పాటు చట్టంలోని లొసుగులు, బిల్డింగ్ ఎలివేషన్, బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలతో సహా బోర్డు ఎన్నికలకు సంబంధించిన విషయాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లే యోచనలో అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం అవుతున్నారు. 2020 కంటోన్మెంట్ యాక్టును పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా చేసి పలు సవరణలు చేయాలని కోరనున్నారు. ఈ క్రమంలోనే 2020 యాక్ట్కు సంబంధించి కమిటీ ప్రధానంగా ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. యాక్ట్ అమల్లోకి వస్తే అనేక మార్పులు చోటుచేసుకోవడంతో పాటు బోర్డు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా బోర్డు పరిధిలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కూడా యాక్ట్ అమలుతో పరిష్కారం అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కమిటీతో మాట్లాడేందుకు ప్రజాప్రతినిధులకు అవకాశం లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గురువారం రానున్న క్రమంలో తొలుతగా బోర్డు కార్యాలయానికి చేరుకోనున్నారు. 25 కూడిన కమిటీ మొదటగా బోర్డు అధికారులతో సమావేశమైన తరువాత నేరుగా ఏఓసీ సెంటర్లో లోకల్ మిలటరీ అథారిటీ (ఎల్ఎంఓ) అధికారులతో భేటీ కానున్నారు. అనంతరం అక్కడి నుంచి కార్ఖానా పంప్హౌస్ను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చివరగా బొల్లారం జనరల్ దవాఖానను సందర్శించి పలు వివరాలను సేకరించనుంది. ప్రధానంగా షెడ్యూల్డ్లో కమిటీ బృందం ప్రజాప్రతినిధులు కానీ స్థానికులతో గానీ సమావేశం అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. కమిటీ బృందం ముందున్న సవాళ్లను ఎలా అధిగమిస్తుందో లేదో వేచిచూడాల్సిందే…!
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం నూతన శోభను సంతరించుకుంది. నేడు డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందం రానున్న నేపథ్యంలో బోర్డు అధికారులు కార్యాలయానికి మెరుగులు దిద్దారు. దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్ బోర్డుగా ఉన్న తరుణంలో పాత గోడలకు కొత్త రంగులను అద్దారు. కార్యాలయం చుట్టూ అద్దంలా మెరిసే రోడ్లు, గ్రీనరీ గార్డెన్తో మొక్కలను ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా కనీసం కార్యాలయాన్ని పట్టించుకోని అధికారులు కమిటీ రాకతోనైనా మెరుగులు దిద్దడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.