కవాడిగూడ, ఏప్రిల్ 5: సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్దేనని ఆ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా ముషీరాబాద్ నియోజక వర్గంలోని హెరిటేజ్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజక వర్గ బీఆర్ఎస్ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా పద్మారావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ను బీఆర్ఎస్ శ్రేణులు గజ మాలలో ఘనంగా సత్కరించారు.
అనంతరం భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ 14 ఏండ్లు కష్టపడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, హైదరాబాద్ను అనేక రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జిని నిర్మించినట్లు చెప్పారు. బస్తీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయామని గుర్తు చేశారు. హైదరాబాద్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచినీళ్లు, విద్యుత్ నిరంతరంగా ఉండేవని, కానీ నేడు తాగునీటి సమస్యలు తీవ్రంగా తలెత్తుతున్నాయన్నారు.
ఒక్కసారి తనను ఆశీర్వదిస్తే.. అందరికీ అందుబాటులో ఉంటూ ఇక్కడి సమస్యలను పార్లమెంట్లో వినిపించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీతా ప్రకాశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్ రెడ్డి, ముఠా పద్మా నరేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్, రాష్ట్ర యువజన నాయకుడు ముఠా జైసింహ, వివిధ డివిజన్ల అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, ఎం. రాకేశ్ కుమార్, బల్లా శ్రీనివాస్ రెడ్డి, కొండా శ్రీధర్ రెడ్డి, నేతలు మాచర్ల పద్మజ, మహ్మద్ అలీ పాల్గొన్నారు.