సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 ( నమస్తే తెలంగాణ ) : రాబోయే ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా సెక్టోరియల్ అధికారులు, పోలీస్ యంత్రాంగం సమష్టిగా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సూచించారు. బంజారాహిల్స్లోని ఆదివాసీ బంజారా భవన్లో శనివారం సెక్టోరియల్ అధికారులు, పోలీస్ సెక్టోరియల్ అధికారులతో ఆయన ఎన్నికలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. ప్రతి పది నుంచి 12 పోలింగ్ స్టేషన్లకు ఒక సెక్టోరియల్ అధికారి, పోలీస్ సెక్టోరియల్ అధికారిని నియమించామని చెప్పారు. సెక్టోరియల్ అధికారులు సెప్టెంబర్ 30 నాటికి పోలింగ్ స్టేషన్ల మ్యాపింగ్, ఏరియా మ్యాపింగ్ తదితర పూర్తి సమాచారం అందించాలని కోరారు. పోలింగ్ స్టేషన్ 200 మీటర్ల లోపు ఎవరిని అనుమతించకూడదని సూచించారు. నగర కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఈసారి పోలింగ్ స్టేషన్ల సంఖ్య గతంలో కంటే ఎక్కువగా పెరిగాయని చెప్పారు. ఈ సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మన్, ఖైరతాబాద్ ఆర్వో వెంకటేశ్ దోత్రే, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష..
జూబ్లీహిల్స్: ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల ఏర్పాట్లు చేయాలని, సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ పూర్తిచేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. శనివారం బీఆర్కేభవన్లో ఎన్నికల నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, అడిషనల్ కమిషనర్లు స్నేహ, చంద్రకాంత్రెడ్డి, శంకరయ్య, నోడల్ అధికారులు పాల్గొన్నారు.