మెహిదీపట్నం జూన్ 25 : ఆషాఢమాసం బోనాలలో భాగంగా ఆదివారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో రెండో బోనం పూజ అంగరంగ వైభవంగా జరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి బోనాలు చేసి అమ్మవారికి సమర్పించారు. బాలాహిస్సార్ నుంచి నగీన బాగ్, రాందాస్ బందీఖానా, జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వరకు భక్తులు కిటకిటలాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్, ఈవో శ్రీనివాస్ రాజు పూజలు చేయించారు. జలమండలి, దేవాదాయ, పోలీస్, వైద్య, ఆరోగ్య, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో భక్తులు బోనాలు జరుపుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆలయ సలహాదారు సిరుగుమల్లె రాజువస్తాద్, కులవృత్తుల సంఘం చైర్మన్ సాయిబాబా చారి, గోల్కొండ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సయ్యద్ ముజీద్ ఉర్ రహమాన్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఘనంగా ఘటోత్సవాల ఎదుర్కోలు
ఉజ్జయినీ మహంకాళి ఆషాఢ బోనాల జాతరలో భాగంగా ఆదివారం ఘటోత్సవ ఎదుర్కోలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ఘటం తయారీకి అవసరమైన అలంకరణ వస్తువులతో పాటు అమ్మవారి ప్రతిమను, పసుపు కుంకుమలను దేవాలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు సురిటి రామేశ్వర్కు అప్పగించారు. ఈ సందర్భంగా ఘటోత్సవ తయారీకి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 7 గంటలకు కర్బలా మైదానం నుంచి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా దేవాలయానికి తీసుకువచ్చారు. భక్తులు పెద్దసంఖ్యలో ఈ పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో దేవాలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్రెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.