సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ) : ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఘట్కేసర్ నుంచి యాదాద్రి (టెంపుల్ సిటీ) వరకు ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసును పొడిగించే ప్రాజెక్టు పనులపై గురువారం దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ సమీక్షించారు. ఈ సందర్భంగా యాదాద్రి రైల్వే స్టేషన్ను నేరుగా సందర్శించి అక్కడి ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం గతంలో కేటాయించిన రూ.330 కోట్ల బడ్జెట్ను సవరించి ప్రస్తుతం రూ.430 కోట్లు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు కోసం అయ్యే పూర్తి ఖర్చును రైల్వే బోర్డు భరిస్తుందన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం భాగస్వామ్యం ఏ మాత్రం ఉండబోదన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ప్రత్యేక రైల్వే లైను నిర్మిస్తారు. ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి మీదుగా నూతన లైను నిర్మిస్తున్నారు. అలాగే యాదాద్రి రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎంఎంటీఎస్ పొడిగింపులో భాగంగా స్టేషన్కు తూర్పు వైపు కొత్త స్టేషన్ భవనం నిర్మించబోతున్నారు. అలాగే స్టేషన్ ముఖచిత్రం కూడా అభివృద్ధి చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ మున్నా కుమార్ తదితరులు పాల్గొన్నారు.