ముషీరాబాద్, జనవరి 28 : ఇటీవల కర్ణాటక అల్వాస్ యూనివర్సిటీలో జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జంబూరీ(వేడుకల) కార్యక్రమాల నివేదికను ఆ విభాగం ప్రతినిధులు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవితకు సమర్పించారు. శనివారం భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యదర్శి మంచాల వరలక్ష్మి, గైడ్ ఆర్గనైజింగ్ కమిషనర్ జీ.అనంతలక్ష్మి , స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ జి.పరమేశ్వర్ చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవితను ఆమె వివాసంలో కలిసి విద్యార్థులు ఇంటర్నేషనల్ కల్చరల్ జంబూరీలో ప్రతిభ సాధించిన తీరును వివరించారు. తెలంగాణకు చెందిన 102 మంది విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్లో పాల్గొని జంబూరీలో కలర్ పార్టీ, మార్చ్ ఫాస్ట్, ఫోక్ డ్యాన్స్, బతుకమ్మ పండుగ, ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్, స్టేట్ ఎగ్జిబిషన్ విభాగాల్లో ఏ గ్రేడ్ అవార్డులు సాధించినట్లు వెల్లడించారు. తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్కు 5 ఏ గ్రేడ్ రావడం అభినందనీయమని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత అన్నారు.కర్ణాటక, రాజస్తాన్లలో జరిగిన జంబూరిలో తెలంగాణ బాలబాలికలు 400 మంది పాల్గొని 22 ఈవెంట్లలో 6ఏ గ్రేడ్ అవార్డులు, 8 బీ గ్రేడ్ అవార్డులను సాధించి రాష్ర్టానికి మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. అనంతరం కవితకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.