సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి విద్యార్థులు స్కూల్ బాట పట్టనున్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నీ మళ్లీ విద్యార్థులతో కళకళలాడనున్నాయి. సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభమవుతుండడంతో స్కూలు యాజమాన్యాలు అన్ని ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ జిల్లాలో 672 ప్రభుత్వ పాఠశాలలుండగా, అందులో 481 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటితో పాటు 25 ప్రిప్రైమరీ పాఠశాలలు ఉండగా నేడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు. కాగా మన్నా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మొదటి దశలో 45 పాఠశాలల్లో మొత్తం 12437 మంది విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్లు డీఈవో తెలిపారు.