ప్రభుత్వ ఆదేశాల మేరకు సుమారు 16 నెలల విరామం తర్వాత బడిగంట మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులు మొదటి రోజు ఉల్లాసంగా.. ఉత్సాహంగా బడిబాట పట్టారు. స్నేహితులను కలుసుకుని సంబురపడ్డారు. పిల్లల కేరింతలతో బడులన్నీ సవ్వడిగా మారాయి. ఇన్నాళ్లు ఆన్లైన్ బోధనలతో అపసొపాలు పడిన విద్యార్థులు తాజాగా తరగతి గదిలో బ్లాక్ బోర్డుపై ఉపాధ్యాయులు చెప్పే ప్రత్యక్ష బోధనలు వింటూ ఆనందం వెలిబుచ్చారు. అంతకుముందు పాఠశాల గేటువద్దనే థర్మల్ స్క్రీనింగ్ చేసిన అనంతరం విద్యార్థులను ఆవరణలోకి అనుమతించారు. ప్రార్థనా సమయం మొదలుకొని, తరగతి గదుల్లో సామాజిక దూరం పాటించేలా.. బెంచ్ మీద ఇద్దరు విద్యార్థులు మాత్రమే కూర్చునేలా చర్యలు చేపట్టారు. ప్రతి నిత్యం మాస్కులు ధరించి, శానిటైజ్ చేసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని బడుల్లో ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. అడుగడుగునా కరోనా నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించారు. కాగా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 21.04 % విద్యార్థులు హాజరయ్యారు. రాజ్భవన్ స్కూల్ను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, మహేశ్వరంలోని ప్రభుత్వ పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఖైరతాబాద్, సెప్టెంబర్ 1 : ‘స్టూడెంట్స్ ఎలా ఉన్నారు.. స్కూల్ తెరిచారు.. హ్యాపీయేనా.. జాగ్రత్తగా ఉండాలి.. చక్కగా చదువుకోవాలి’ అని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్రాజన్ రాజ్భవన్ హైస్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. బుధవారం సోమాజిగూడలోని రాజ్భవన్ హైస్కూల్ను డీఈఓ రోహిణి, డిప్యూటీ ఐఓఎస్ శాంతారాథోడ్తో కలిసి సందర్శించారు. తరగతి గదులకు వెళ్లి కొవిడ్ నియంత్రణ ఏర్పాట్లను పరిశీలించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్ డాక్టర్ మామిడి భీమ్ రెడ్డి సమకూర్చిన మాస్కులు, హ్యాండ్ వాష్లు, కొవిడ్ ట్రీట్మెంట్ కిట్లను రాజ్భవన్ ప్రైమరీ, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మంజులత, కరుణశ్రీలకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత విద్యార్థులు పాఠశాలకు రావడంతో వారి కండ్లలో అమితమైన ఆనందం కనిపించిందన్నారు. గవర్నర్గా, వైద్యురాలిగా.. ఒక పేరెంట్గా పిల్లల జాగ్రత్తకు మొదటి ప్రాధాన్యతనిస్తానని, ఉపాధ్యాయులు వారిని కంటికి రెప్పలా చూసుకోవాలన్నారు. గవర్నర్ వెంట పర్సనల్ సెక్రటరీ సురేంద్ర మోహన్, సహాయ కార్యదర్శి రఘుప్రసాద్, అదనపు కార్యదర్శి సీతారాములు, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.
బోసిపోయిన బడుల్లో మళ్లీ సందడి ప్రారంభమైంది. విద్యార్థుల చేరికతో తరగతి గదుల్లో కేరింతల సవ్వడి నెలకొన్నది. ఏడాదిన్నర తర్వాత కొత్త శోభ సంతరించుకున్నది. ఇన్నాళ్లూ సెల్ఫోన్లోనే పాఠాలు విని వాటిని అర్థం చేసుకోలేక సతమతమైన విద్యార్థులు ఆ బాధలకు ముగింపు పలుకుతూ బుధవారం నాడు క్లాసుల్లో చేరారు. నగరవ్యాప్తంగా ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా ఉంది. మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో 83,841 విద్యార్థులకు 18,547 మంది, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో కలిపి 6,94,413 మంది విద్యార్థులకు 1,45,442 మంది హాజరయ్యారు. మేడ్చల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 26.32.. ప్రైవేట్ స్కూళ్లలో 19..65 హాజరు శాతం నమోదైనట్లు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖాధికారులు ప్రకటించారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ విద్యా విధానానికే మొగ్గు చూపగా.. కేంద్రీయ విద్యాలయాలు మాత్రం షిప్ట్ల వారీగా తరగతులను నిర్వహిస్తున్నాయి.
సిటీబ్యూరో, మేడ్చల్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో తొలి రోజు గురుకుల విద్యా సంస్థలు మినహా.. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. బుధవారం హైదరాబాద్ జిల్లాలో 21.04 శాతం విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే 30శాతం పైగా ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ పాఠాలకే మొగ్గు చూపుతున్నాయి.
చాలా రోజుల తరువాత పిల్లలను స్కూల్లో చూడటం ఆనందంగా ఉంది. ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేయడంతో పాటు భౌతిక దూరం పాటించి కూర్చునేలా తరగతి గదులను సిద్ధం చేశాం. తొలి రోజు కావడంతో కొంతమంది విద్యార్థులు పాఠశాలకు రాలేకపోయారు. విద్యార్థులు సైతం ప్రత్యక్ష బోధనకే మొగ్గు చూపుతుండటంతో రానున్న రెండు మూడు రోజుల్లో హాజరు శాతం పెరుగుతుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠాలు బోధిస్తున్నాం. ప్రత్యేకంగా ఐసొలేషన్ గదులను ఏర్పాటుచేశాం. – కృష్ణమూర్తి, ప్రధానోపాధ్యాయుడు, సీతాఫల్మండి ప్రభుత్వ పాఠశాల
చాలా రోజుల తర్వాత స్కూల్కు వచ్చి టీచర్లు, ఫ్రెండ్స్ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఆన్లైన్లో టీచర్లు చెప్పే పాఠాలు పూర్తిగా అర్థం కావడం లేదు. టెక్నికల్ సమస్య వల్ల ఒక్కోసారి క్లాసులు మిస్సయ్యేదాన్ని. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. టీచర్లందరూ స్కూల్కు వచ్చారు. స్కూల్కు రాగానే ముందుగా థర్మల్ స్క్రీనింగ్ చేసి శానిటైజ్ చేశారు. మాస్కులు తీయవద్దని చెప్పారు. ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడాలని సూచించారు. స్కూల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి భయం లేదు. చక్కగా చదువుకోవచ్చు. – కె. భవానీ, 9వ తరగతి, రాజ్భవన్ హైస్కూల్
కరోనా కంటే ముందు ఎంతో మంది స్నేహితులతో కలిసి బడికి వచ్చేది. ఆన్లైన్ క్లాసుల కారణంగా చాలా మంది సొంత ఊర్లకు వెళ్లారు. ఇప్పుడు స్కూల్స్ ప్రారంభమైనప్పటికీ కొందరు స్కూల్కు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. చాలా బాధేస్తున్నది. మా టీచర్లు మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిత్రులంతా ఎలాంటి భయాందోళనలు లేకుండా స్కూల్కు రావొచ్చు. – లక్ష్మీనర్సింహ, 5వ తరగతి, ప్రాథమిక పాఠశాల, కుత్బుల్లాపూర్
పాఠశాల తరగతులతో చదువుకు ఆటంకం ఉండదు. ఆన్లైన్ తరగతులతో సందేహం వస్తే ఏమి చేయాలో తెలియక ఇబ్బంది పడ్డాం. పాఠశాలకు వస్తే స్నేహితులతో చర్చించి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నేరుగా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవచ్చు. పాఠశాలలో కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. – మేఘన, టెన్త్, జడ్పీహెచ్ఎస్, గుండ్లపోచంపల్లి
ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో పాఠాలు విన్నాం. చాలా రోజుల తర్వాత పాఠశాలకు వచ్చి టీచర్లను, స్నేహితులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. తరగతి గదులతోపాటు పాఠశాల ఆవరణ మొత్తం శానిటైజేషన్ చేయించారు. మాస్కులు ధరించి పాఠశాలకు వచ్చాం.- ఆర్.ప్రవీన్, విద్యార్థి
నా కొడుకు 9వ తరగతి, నా కూతురు 7వ తరగతి చదువుతున్నారు. నా ఇద్దరు పిల్లలకు రెండు మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్ వాష్ ఇచ్చి పంపించాను. పెన్సిల్ పెన్నులు కూడా షేర్ చేసుకోవద్దని చెప్పాను. మధ్యాహ్న భోజనం ఇంటి నుంచే పంపించాను. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వారికి స్నానం చేపించాను. రాజ్భవన్ స్కూల్లో నిబంధనలు పాటిస్తున్నారు. ధైర్యంగా నా పిల్లలను స్కూల్కు పంపించాను. – పార్వతి, విద్యార్థి తల్లి