కవాడిగూడ, జూలై 29: ఎన్నికల ముందు డబ్బులు దండుకునేందుకే మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్ ఆరోపించారు. శనివారం లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలువురు నాయకులతో కలిసి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగానికి విరుద్ధమని, దేశంలో 1262 కులాలున్నాయని, వీటన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చి రిజర్వేషన్లు కల్పించారని, ఈ కులాలన్నింటిని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మందకృష్ణ మాదిగ బ్లాక్మెయిల్ చేసి వర్గీకరణ కోసం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
ఆర్టికల్ 341 కు విరుద్ధంగా ఉన్న షెడ్యూల్డ్ కులాలను విడదీసే హక్కు ఎవరికి లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని మందకృష్ణ మాదిగ గమనించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో ముఖ్య సలహాదారు రావుల అంజయ్య, ఆర్వై. గిరి, వర్కింగ్ చైర్మన్లు కట్టెల గిరధర్, నర్సింహ, కో-ఆర్డినేటర్ విజయ్కుమార్, శ్రీరాములు, మల్లేశ్ పరుశరామ్, కనకయ్య, ప్రభాకర్, వెంకన్న, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.