కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీల బకాయిలపై గులాబీ సేన కదం తొక్కింది. ‘సేవ్ కంటోన్మెంట్’ అంటూ నినదించింది. ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వందలాది మందితో బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా జరిపి.. శాంతియుత నిరసన తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధిపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఆక్షేపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.
సర్వీస్ చార్జీల బకాయిలపై గులాబీ సేన పోరు
వందలాదిమందితో బోర్డు కార్యాలయం వద్ద ధర్నా
హాజరైన ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్రెడ్డి
సికింద్రాబాద్, ఏప్రిల్ 7 : కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కుంటుపడేలా వ్యవహారం, బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీల బకాయిలపై మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్ర సర్కారుపై గులాబీ సైన్యం కదం తొక్కింది. సుమారు రూ.680 కోట్ల బకాయిలను మంజూరు చేయడంలో తాత్సారం చేస్తున్నదని, తద్వారా బోర్డు పరిధిలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తమైంది. ‘సేవ్ కంటోన్మెంట్’ పేరిట గురువారం 8 వార్డుల నుంచి టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో బోర్డు కార్యాలయం వద్ద భారీధర్నా జరిగింది. కార్యాలయ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డుకు టీపీటీ నిధులను రాష్ట్ర సర్కారు విడుతలుగా విడుదల చేస్తున్నా కేంద్రం సర్వీస్ చార్జీల బకాయిలు ఇవ్వకుండా జాప్యం చేస్తుందన్నారు.
బోర్డు అభివృద్ధికి సహకరించడం లేదని, రూ.680 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులు చేపట్టకపోగా తరచూ రోడ్ల మూసివేతవల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రక్షణశాఖ మంత్రి దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లలో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయని సూచించారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి,మాజీ సభ్యులు లోక్నాథ్, పాండుయాదవ్, నళిని కిరణ్, శ్యామ్కుమార్, ప్రభాకర్, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు ముప్పిడి గోపాల్, ముప్పిడి మధుకర్, దేవులపల్లి శ్రీనివాస్, మహంకాళి శర్విన్, పెద్దాల నర్సింహ, ప్రవీణ్యాదవ్, సంతోష్యాదవ్, రాజుసింగ్, సురేష్, శ్రీధర్, లతామహేందర్, సరిత, శ్రీహరి, విజయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నిరసన ప్రదర్శనలో ఉద్రిక్తత
టీఆర్ఎస్ చేపట్టిన ధర్నా, నిరసన ప్రదర్శనలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలోనే కాషాయ నేతలు పోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ నాయకులు బీజేపీ శ్రేణులపై ఎదురుదాడికి దిగారు.
బోర్డు అభివృద్ధికి విఘాతం
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధి కుంటుపడుతోంది. కేంద్రం బకాయిలు విడుదల చేయకుండా వివక్ష చూపుతోంది. ఆర్మీ అధికారులు రోడ్లను మూసివేయడంతో నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. లాల్బజార్ హనుమాన్ ఆలయాన్ని మూసివేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. -ఎస్.సునిత, లాల్బజార్, తిరుమలగిరి
అడ్డుపడుతున్న కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ అభివృద్ధికి సహకరిస్తున్నా లోకల్ మిలటరీ అధికారులు ప్రతిదానికీ అడ్డుపడుతున్నారు. రోడ్ల మూసివేత మొదలు, బకాయిలు విడుదల చేయడం వరకు కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుంది. కేంద్రం నిధులు మంజూరు చేసి కంటోన్మెంట్ ప్రగతికి సహకరించాలి. – డి.అంబిక, కంసారిబజార్, బోయిన్పల్లి