అల్లాపూర్, నవంబర్ 26 : అల్లాపూర్ డివిజన్ పరిధి గాయత్రినగర్లో ఎన్నో ఏండ్ల నుంచి పరిష్కారానికి నోచుకొని అపరిష్కృత డ్రైనేజీ సమస్యకు త్వరలో మోక్షం లభించనున్నది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పాత డ్రైనేజీ పైపులైన్ సామర్థ్యం సరిపోకపోవడంతో తరచూ గాయత్రినగర్ ఆంధ్రాబ్యాంక్ వద్ద మ్యాన్హోల్ పొంగి మురుగు రోడ్లపై పారుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరో వైపు వర్షాకాలంలో చిన్నపాటి వాన పడ్డా మ్యాన్హాల్ పొంగి వీధుల్లో మురుగునీరు చేరి స్థానికులు నడవడానికి కూడా కష్టంగా ఉండేది. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు స్థానిక కార్పొరేటర్ సబీహాబేగం ఎమ్మెల్యే సహకారంతో రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో 900, 300, 400 ఎంఎం డయా అండర్ గ్రౌండ్ పైపులైన్ పనులను ఇటీవలే ప్రారంభించారు.
పర్వత్నగర్ నుంచి మొదలైన పనులు జనప్రియానగర్, వివేనందనగర్, తులసినగర్, గాయత్రినగర్ వరకు పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో నాణ్యత లోపాలు జరగకుండా కార్పొరేటర్ సబీహాబేగం అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. పనులు పూర్తయితే రానున్న వర్షాకాలంలో రోడ్లపై వరద నీరు నిల్వకుండా సాఫీగా వెళ్లిపోయి, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అల్లాపూర్లో అంతర్గత డ్రైనేజీని నాణ్యతగా నిర్మిస్తున్నాం. 900, 300, 450 ఎంఎం డయామీటర్ సిమెంట్ పైపులైన్ వేస్తుండటంతో భవిష్యత్లో డ్రైనేజీ సమస్య తలెత్తకుండా ఉంటుంది. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– రంజిత్, ఏఈ