బంజారాహిల్స్ : ప్రముఖ బ్రాండ్లకు చెందిన వస్త్రాలను పోలిన వస్త్రాలను విక్రయిస్తున్న షాపు నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని ఇంక్ బ్లూ షోరూమ్లో బ్రాండెడ్ వస్త్రాలైన రాల్ఫ్ లారెన్ పోలో, అర్మానీ, బర్బరీ తదితర బ్రాండ్లను పోలిన వస్త్రాలను విక్రయిస్తూ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు సమాచారం అందుకున్న వీఎస్కే గ్లోబల్ సంస్థ ఇన్వెస్టిగేషన్ అధికారి సయ్యద్ మహ్మద్ ఫారూఖ్ రెండ్రోజుల క్రితం పరిశీలన చేశారు.
ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ బ్రాండెడ్ వస్త్రాలను అమ్ముతున్నట్లు గుర్తించిన ఫారూఖ్ ఈ మేరకు గురువారం బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ నాణ్యతలేని వస్త్రాలను విక్రయించడం ద్వారా అసలైన సంస్థల బ్రాండ్ ఇమేజీని దెబ్బతీయడంతో పాటు మోసానికి పాల్పడుతున్న ఇంక్బ్లూ షోరూమ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సంస్థపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.