సదర్ సంబురమైంది.. దున్నల వేషధారణ అదిరింది.. విన్యాసాలు విశేషంగా అలరించాయి. దీపావళి సందర్భంగా యాదవులు ప్రతియేటా నిర్వహించే సదర్ ఉత్సవాలు భాగ్యనగర వీధులకు కొత్త అందాన్ని తెచ్చాయి. బలీయమైన మహిషాలను చూసేందుకు వచ్చిన జనంతో కూడళ్లు కిక్కిరిశాయి. గురు, శుక్రవారాల్లో నగరంలో పలుచోట్ల నిర్వహించిన సదర్ సమ్మేళనాలు కనులపండువగా జరిగాయి.
కోట్లు వెచ్చించి ఆయా రాష్ర్టాల నుంచి తెచ్చిన దున్నలను నిర్వాహకులు ముస్తాబు చేసి పోటీల్లో నిలిపారు. ఖైరతాబాద్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరై నృత్యం చేశారు. శనివారం కూడా ఆయా ప్రాంతాల్లో సదర్ ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు.
దున్నరాజులు దుమ్ములేపాయి.. రంకలేస్తూ.. విన్యాసాలు చేశాయి. ‘సదర్’తో నగరం కోలాహలంగా మారింది. యాదవుల ఐక్యతకు నిదర్శనమైన ఈ సమ్మేళనం నగరంలో కనులపండువగా జరిగింది. నగరవ్యాప్తంగా వేడుకలు ఉత్సాహంగా సాగాయి. అశేష జనసందోహం.. కేరింతల మధ్య..భారీ కాయమున్న మహిషాలతో యువకులు కుస్తీపట్టారు.
హయత్నగర్లో యాదవ సంఘం నేత గడ్డం బాలకృష్ణ యాదవ్, మన్సురాబాద్ డివిజన్ కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ సదర్ సమ్మేళనం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏఐవైఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాబురావు యాదవ్, జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్ డివిజన్ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతుశ్రీదేవి, మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్నా నాగేశ్వర్రావు, యాదవ సంఘం సభ్యులు సర్వబాబు యాదవ్, రాజు యాదవ్ ,టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ మల్లాపూర్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. శ్రీనివాసపురంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉత్సవాలను ప్రారంభించారు.
రాజాధి రాజాను నేనురాబాదం.. కాజు.. పిస్తా.. కర్జూరం.. యాపిల్.. 24 గంటలు విడుతల వారీగా పర్యవేక్షణ..ఇదీ దున్నరాజుల రాజసం. రోజుకు రూ. 4వేల నుంచి 6వేల విలువైన పౌషకాహారాన్ని తీసుకుంటాయి. ఇంతటి బలిష్టమైన దున్నపోతుల విన్యాసాలు సదర్ ఉత్సవాల్లో అబ్బురపరుస్తాయి. వీటిని చూసేందుకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తుంటారు. అందుకే సదర్ సందడిగా సాగుతుంది. ఈ సారి కూడా సంబురాలు ఆకాశన్నంటేలా సర్కారు ఏర్పాట్లు చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి తెచ్చిన కొన్ని దున్న రాజుల వివరాలు మీకోసం..
సర్తాజ్: ఇది హైదరాబాదీ దున్నరాజు. యజమాని అఖిల భారత యాదవ మహాసభ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎడ్ల హరిబాబు యాదవ్. హర్యానా నుంచి కొనుగోలు చేశారు. బరువు 1500 కేజీలు. 7 ఫీట్ల పొడవు, 15 ఫీట్ల వెడల్పు. దీని విలువ 16 కోట్లపైమాటే. వయసు ఏడేండ్లు.
రోజులో ఒక్క దున్నరాజుకు ఇచ్చే పోషకాహారం విలువ 4-6వేలు. ఉదయం కాజు, పిస్తా, బాదం, కర్జూరం, బెల్లం, పాలు, యాపిల్స్, అరటిపండ్లు అందిస్తారు. వీటిని చూసుకునేందుకు ఇద్దరు వ్యక్తులు ఉంటారు. 24 గంటలు విడుతల వారీగా పర్యవేక్షిస్తారు. సాయంత్రం 3 కిలోమీటర్లు వాకింగ్ తీసుకెళ్తారు. దున్నరాజుల వీర్యాన్ని రూ.300 నుంచి రూ. 6 వందల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ ఖలీ: దీని బరువు 1800కిలోలు. ఎత్తు 7.2 ఫీట్లు, 17 ఫీట్ల పొడవు ఉంటుంది. తెలంగాణలోనే పుట్టి పెరిగింది. ఇది హర్యానా జాతికి చెందినది. యాపిల్స్ ఇష్టంగా తింటుంది.
కింగ్ చాంపియన్: దీని బరువు 1500 కిలోలు. ఎత్తు 6.5, పొడవు 15 ఫీట్లు ఉంటుంది. దీనిని హర్యానా నుంచి తీసుకొచ్చారు.
కింగ్: దీని బరువు 1450 కేజీలు. పొడవు 7.2.. వెడల్పు 15 ఫీట్లు. చూడటానికి గాంభీరంగా కనిపిస్తుంది. విన్యాసాలను ప్రదర్శించడంలో దిట్ట. ఇది హైదరాబాద్కు చెందినది. వయసు నాలుగున్నర ఏండ్లు.
భీమ్: బరువు 1450 కేజీలు. పొడవు 7.5. వెడల్పు 15.6. హర్యానాకు చెందినది. సెప్టెంబర్ 31న నగరానికి వచ్చింది.
దారా: బరువు 1400 కేజీలు. పొడవు 6.5 ఫీట్లు, వెడల్పు 14.5 అడుగులు.
తలసాని అర్జున్: వయసు రెండున్నర ఏండ్లు. హర్యానా నుంచి కొనుగోలు చేశారు. పొడవు 6 ఫీట్లు, వెడల్పు 14 ఫీట్లు. బరువు 1300 కేజీలు. యజమాని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
ఖైరతాబాద్, నవంబర్ 5 :ఖైరతాబాద్కు చెందిన నవయుగ యాదవ్ సంఘం శుక్రవారం రాత్రి నిర్వహించిన సదర్ సమ్మేళనం నేత్రపర్వంగా సాగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సదర్ ఊరేగింపు అనేది ఆనవాయితీగా జరుగుతున్నదన్నారు. కాగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ హాకీ కర్రలు చేతబూని నృత్యం చేసి ఆకట్టుకున్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ విజయారెడ్డి, నవయుగ యాదవ్ సంఘం చైర్మన్ మంగళారపు చౌదరి సత్తయ్య యాదవ్, మహేశ్యాదవ్, మధుకర్యాదవ్, రాజు యాదవ్, మల్లికార్జున్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బేగంపేట్ నవంబర్ 5: సదర్ సమ్మేళనం యాదవులు ఎంతో ఘనంగా జరుపుకొనే వేడుకని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సదర్ వేడుకల్లో పాల్గొనే దున్న రాజుల ప్రదర్శనను పరిశీలించారు.