ఆర్కేపురం, అక్టోబర్ 17: సీఎం కేసీఆర్ పేరు వింటేనే ప్రధాని మోడీకి వణుకుపుడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గ్రీన్హిల్స్ కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి మంత్రి సబితారెడ్డి అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ బలం, బలగం ప్రతి పక్షాలకు అంతుపట్టడం లేదని, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో ప్రతిపక్ష పార్టీల నాయకులు అయోమయానికి గురవుతున్నాయని చెప్పారు.
ఎన్నికలు రాగానే తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నారని, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్న గుజరాత్, ఉత్తర్ప్రదేశ్ రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉన్నదని అన్నారు. సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లలో పార్టీ సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించి.. పార్టీ గెలుపునకు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మీ ఆడ బిడ్డగా అడుగుతున్నా.. మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా మారుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ, డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్, షాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెంటూరి రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.