ఎన్నో ఏండ్లుగా రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనదారులు, పాదచారులు పడుతున్న కష్టాలకు జీహెచ్ఎంసీ శాశ్వత చెక్ పెట్టనున్నది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఇంజినీర్ల బృందం ఇటీవల రైల్వే శాఖ తో చర్చించింది. ఫలితంగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా కొత్తగా 42 చోట్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణ పనుల్లో ముందడుగు పడింది. అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండేలా ఆర్యూబీలపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.
ఇంజినీర్ల బృందం అధ్యయనం తరువాత ఐదు చోట్ల ఆర్వోబీ, ఆర్యూబీ పనులపై స్పష్టతను తీసుకువచ్చారు. ఇందులో చార్మినార్ జోన్ యాకత్పుర ఆర్యూబీ పనులను పట్టాలెక్కించారు. సికింద్రాబాద్ జోన్ మాణికేశ్వర నగర్ ఆర్యూబీ, చార్మినార్ జోన్ శివరాంపల్లి ఆర్వోబీ పనులకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులకు జీహెచ్ఎంసీ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. సికింద్రాబాద్ జోన్ చిలకలగూడ ఆర్యూబీ, గౌతమ్నగర్ ఆర్యూబీ పనులకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ రెండు చోట్ల పనులకు జీహెచ్ఎంసీ టెండర్ల పిలుపునకు కసరత్తు చేస్తున్నది. ఇక 24 చోట్ల ఆర్యూబీ, ఆర్వోబీ ప్రతిపాదనలను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. హెచ్ఆర్డీసీఎల్, ఆర్అండ్బీ శాఖ పరిధిలో తొమ్మిది ఆర్వోబీ, ఆర్యూబీల ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. కాగా ఖైరతాబాద్ రైల్వే గేటు, ఎంఎస్ మక్తా, తుర్కపల్లి, సఫిల్గూడలో ఆర్వోబీ, ఆర్యూబీ సాధ్యం కాదని తేల్చారు.
-సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ)