సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 ( నమస్తే తెలంగాణ ) : ఓ వైపు సాంకేతికతపరంగా నగరం దూసుకుపోతుంటే.. మరోవైపు ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో టీజీఆర్టీసీ వెనకబడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సుల సమాచారం అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ ‘గమ్యం’ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే. తొలుత సుమారు 4,170 బస్సులను ‘ఈ’ ట్రాకింగ్ సదుపాయం కల్పించారు. జిల్లా బస్సులతో పాటు పుష్పక్, మెట్రో బస్సుల్లోనూ ఈ యాప్తో పర్యవేక్షించేలా రూపొందించారు. ప్రయాణికులు సులభంగా బస్సు సేవలను ఉపయోగించుకునేలా యాప్ను తీర్చిదిద్దారు. కానీ ఇప్పుడు ఆ గమ్యం యాప్ పనిచేయడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బస్సు వివరాలు ఇచ్చినా నాట్ ఫౌండ్ అంటూ చూపిస్తుందని గ్రేటర్ ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. యాప్లో ఉన్న సమయానికి బస్సులు రావడం లేదని చెబుతున్నారు. కొన్ని సార్లు బస్సు సర్వీసులు రద్దవుతున్నాయని.. ఆ సమాచారం కూడా యాప్ సూచించడం లేదని వాపోతున్నారు. ఓ ప్రయాణికుడు సోమవారం గమ్యం యాప్లో తన రూట్ బస్సు నెంబర్ ఎంటర్ చేయగా జీరో రిజల్ట్ ఫౌండ్ అంటూ వివరాలు రావడం గమనార్హం. మరో ప్రయాణికుడు తను వస్తుందనుకున్న బస్సు కోసం ఎదురుచూడగా ఆ బస్సు ట్రిప్ రద్దవడంతో ఇబ్బందికి గురయ్యాడు.
క్షణం..ఓ అగ్ని పరీక్ష..!
నగరంలోని ప్రయాణికులకు సమయం ఎంతో కీలకం. సంబంధిత సమయం వృథా కాకుండా ప్రణాళికలు వేసుకుంటారు. కానీ ఇందులో గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులపై ఆధారపడే వారికి సమయం ఓ అగ్ని పరీక్షగా మారుతుంది. ఏ బస్సు ఎప్పుడొస్తదో తెలియని దుస్థితి నెలకొంది. మరోవైపు టైం టేబుల్లో ఉన్నైట్టెన బస్సులు రావడం లేదు. నగర బస్సులే కాదు జిల్లా బస్సుల రాకపోకల సమాచారం కూడా తెలియడం లేదని వాపోతున్నారు. సాధారణంగా ఈ యాప్ ముఖ్య ఉద్దేశం.. ప్రయాణికులు తాము ఎంపిక చేసుకున్న బస్సు ఎక్కడుందో ఎంత సేపట్లో తాము ఉన్న బస్టాండ్కు వస్తుందో తెలుపడమే. మొబైల్లో ఈ యాప్ ఉన్న ప్రతి ప్రయాణికుడు బస్సు రాకపోకలను ప్రతిక్షణం ట్రాక్ చేయొచ్చు. బస్సు నడిపే డ్రైవర్, కండక్టర్ వివరాలు కూడా అందులో ఉంటాయి. సిటీ బస్సుల రూట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ బస్సు ఎక్కడుందో తెలిసిపోతుంది. అయితే యాప్ సాంకేతిక సమస్యలను అధికారులు పరిష్కరించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.