సిటీబ్యూరో, మే 22 ( నమస్తే తెలంగాణ) : పన్ను చెల్లించకుండా ఇతర రాష్ర్టాలకు చెందిన వాహనాలు యథేచ్ఛగా నగర రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉన్నా అవేం పట్టనట్టు వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజనాకు కొంతమంది నష్టం చేకూరుస్తున్నారు. లైఫ్ టాక్స్, పెనాల్టీలు చెల్లించకుండా కార్లను వినియోగిస్తున్నారు. ఇలాంటి వారిపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి పన్ను చెల్లించని వాహనాలను సీజ్ చేస్తున్నారు. చాలా వరకు ఇతర రాష్ర్ర్టా ల్లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను నగరంలో తిప్పుతున్నారు. సాధారణంగా పది లక్షలకు పైగా విలువజేసే కొత్త వాహనం అయితే కారు ఖరీదుపై 18 శాతం లైఫ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇతర రాష్ర్టాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయి టాక్స్ చెల్లించి.. రెండేండ్లు గడిస్తే.. ఆ వాహనం తెలంగాణలో నడపాలంటే ఖచ్చితంగా ఇక్కడి నిబంధనల ప్రకారం టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ రెండేండ్ల పన్నుని మినహాయించి మిగత పన్నును వసూలు చేస్తారు. సదరు యజమాని అక్కడ చెల్లించిన సొమ్మును అక్కడి ఆర్టీఏకు దరఖాస్తు పెట్టుకుని తిరిగి తన ఖాతా లో జమ చేసుకోవచ్చు.
ఉదాహరణకు ముంబైలో రూ.9 కోట్ల విలువజేసే కారును కొనుగోలు చేస్తే.. ఆ వాహనాన్ని తెలంగాణలో నడపాలనుకుంటే సుమా రు 21 శాతం టాక్స్ అనగా, సుమారు కోటి 89 లక్షలు పన్ను చెల్లించాలి. చెల్లించకుండా కాలయాపన చేస్తే ఇన్వాయిస్ ఆధారంగా మళ్లీ లైఫ్ టాక్స్పై నెలకు 1 లేదా 2 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. వాహన యజమాని నేరుగా పన్ను చెల్లిస్తే కారు ఖరీదు ఆధారంగా 1 శాతం పెనాల్టీ లేదా అధికారుల తనిఖీల్లో పట్టుబడితే చెక్ రిపోర్ట్ ఆధారంగా 2 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన అనంతరం ఇక్కటి నెంబర్ ప్లేట్ జారీ అవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఆర్టీఏ అధికారులు వాహనాలను సీజ్ చేస్తారు.