హైదరాబాద్, మే 17 (నమస్తేతెలంగాణ): బాధ్యాతయుతమైన హోదాలో ఉన్న బండి సంజయ్ వెంటనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, ఎంపీ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో అరెస్టయిన నేపథ్యంలో ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని, పదవిలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయారని స్పష్టంచేశారు.
సంజయ్ అధికారంలో ఉన్నంతకాలం బాధితురాలికి న్యాయం జరుగదని తెలిపారు. నిందితుడు భగీరథ్ పోలీసులకు అప్పగించినట్టుగా చెప్తున్న సెల్ఫోన్ అతను సాధారణంగా వాడేది కాదని బాలిక తల్లి తనతో చెప్పారని తెలిపారు. మున్ముందు నిందితుడు ఈ కేసును ప్రభావితం చేయబోయే, పోలీసులను దారిమళ్లించే పద్ధతులకు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని పేర్కొన్నారు. సిట్ పర్యవేక్ష ణాధికారి రితిరాజ్ గారూ.. దయచేసి సాధ్యమైనంతమేర ఉత్తమమైన చట్ట పద్ధతులు పాటించి, దర్యాప్తులోని ప్రతి ప్రక్రియను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.
మోదీజీ.. మన్కీ బాత్ను ఆచరణలో చూపండి
‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ.. మన్కీ బాత్, బేటీ బచావో కార్యక్రమాల్లో చిన్నారులకు బోధించే మాటలను ఆచరణలో చూపండి’ అని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విజ్ఞప్తి చేశారు. ‘మీరు చెప్పే మాటలు, బాలికల రక్షణపై మీకున్న చిత్తశుద్ధి నిజమని భావిస్తే వెంటనే బండి సంజయ్ను మంత్రివర్గం నుంచి తొలగించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. బాలికపై దుష్ప్రచారాన్ని ఆపి, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సహకరించమని సూచించాల్సిందిగా ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.