సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): అక్రమ లోన్యాప్ల నిర్వాహకులు మరోసారి బరితెగించారు. నకిలీ లోన్యాప్ల వేధింపులకు తాళలేక హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి రూ.36 లక్షలు క్పోలోయాడు. సనత్నగర్కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి గత సంవత్సరం ఆగస్టులో గూగుల్ప్లేస్టోర్ నుంచి లోన్ రాడార్, క్విక్ఫండ్స్ అనే రెండు లోన్యాప్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రారంభంలో చిన్న మొత్తంలో రుణం తీసుకున్న బాధితుడు వాటిని సకాలంలోనే తిరిగి చెల్లించారు. అయితే బాధితుడి అనుమతి లేకుండానే నిర్వాహకులు భారీ మొత్తంలో నగదును అతని ఖాతాలో వేశారు. కేవలం ఏడురోజుల గడువు అని చెప్పి ఆరోరోజు నుంచే వేధింపులు మొదలుపెట్టారు. యాప్ ఇన్స్టాల్ చేసే క్రమంలో గ్యాలరీ, కాంటాక్ట్స్ అనుమతి పొందిన యాప్ నిర్వాహకులు బాధితుడి ఫొటోలను సేకరించారు.
ఆ ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్చి బాధితుడి బంధువులకు, స్నేహితులకు పంపిస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ మానసిక వేధింపులకు భయపడిన బాధితుడు సెప్టెంబర్ నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి మధ్యకాలంలో రూ.64,16242 చెల్లించాడు. అయితే నిందితులు బాధితుడికి అంతకు ముందు లోన్ రూపంలో పంపిన రూ.29లక్షలను మినహాయిస్తే బాధితుడు నికరంగా రూ.36,16,242 నష్టపోయారని సైబర్క్రైమ్స్ డీసీపీ అరవింద్బాబు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు/ఆర్థిక సంస్థల యాప్ల ద్వారానే రుణాలు పొందాలని, ఇందుకోసం ఆర్బీఐ వెబ్సైట్లో రిజిస్టర్డ్ లెండర్స్జాబితాను తనిఖీ చేయాలని అరవింద్బాబు చెప్పారు.